మామిళ్లగూడెం, మే 16: జిల్లాలోని మారుమూల గ్రామ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింతి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు కోరారు. ఆయన సోమవారం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంప్ డీపీఆర్సీ భవనంలో జిల్లా అభివృద్ది, సమన్వయ పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశం చైర్మన్ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ గౌతమ్, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దిశ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించారు. కేంద్ర నుంచి జిల్లాకు మంజూరవుతున్న పథకాలు, నిధులపై ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్, ప్రధాన మంత్రి కృషి యోజన, స్వచ్ఛ బారత్, సడక్ యోజన, ఆరోగ్య మిషన్తోపాటు 41 పథకాల అమలు తీరుపై సమీక్షించారు. నామా మాట్లాడుతూ.. పథకాల అమలును క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు.
పథకాల అమలులో ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. డీఆర్డీఏ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్, విద్య, వైద్యం, మైన్స్, ముఖ్య ప్రణాళిక, జాతీయ రహదారులు, రైల్వేస్, మున్సిపల్ శాఖలు తమకు మంజూరైన నిధులు, పనుల పురోగతి వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా చేయాలని, కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్కు సంబంధించి రూ.1200 కోట్లు సింగరేణి సంస్థ నుంచి చెల్లించినట్లు చెప్పారు. జాతీయ రహదారులు నేషనల్ హైవేకు సంబంధించి ఖమ్మం జిల్లా పరిధిలో కంబంపల్లి రోడ్డుకు డీపీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్హెచ్ఏ పరిధిలో ఖమ్మం-అశ్వారావుపేట, వరంగల్ -ఖమ్మం పరిధిలో పీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు.
వరంగల్-ఖమ్మం రెండు సీఎఫ్ వర్కులు మంజూరు కావడంతో జరిగిందని 3.11కోట్లతో వాగిని పూర్తి చేశామన్నారు. 21 కిలో మీటర్ల పరిధిలో పీఆర్లో మహాబుబాబాద్, ఖమ్మం జిల్లాకు 28 కోట్లతో నిర్మించనున్న రోడ్లు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 350 కిలో మీటర్ల బేతుపల్లి కాలువ నుంచి వేంసూరు మండలం, సత్తుపల్లి ఎన్ఎస్పీ కాలువ పూడిక తీసినట్లు చెప్పారు. రానున్న వ్యవసాయ సీజన్ వరకు పంట కాలువల మరమ్మతులు చేయాలని కోరారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. గిరి వికాసం అమలు మరింత పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మేయర్ పునుకొళ్లు నీరజ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.