ఖమ్మం వ్యవసాయం, జనవరి 11 : వ్యవసాయ, ఉద్యానపంటల సాగుకు చిరునామాగా ఉన్న ఖమ్మం జిల్లాలో తొలిసారిగా యాసంగి సాగు కనిష్ఠస్థాయిలో కనిపిస్తున్నది. భిన్నపంటల సాగుకు కేరాఫ్గా మారిన జిల్లా రైతాంగం ఈ సంవత్సరం సాగు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం సీజన్లో వారంరోజుల వ్యవధిలోనే ఒకేసారి భారీ వర్షపాతం నమోదైన సందర్భం తప్ప మిగిలిన రోజుల్లో ఆశించిన వర్షాలు పడలేదు. కేవలం సాగర్ కాలువ నీటిపై ఆధారపడి రైతులు వానకాలం సాగు పూర్తిచేశారు. సహజంగా ప్రతి ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో వరి, మక్కసాగు రికార్డు స్థాయిలో జరుగుతుంది. గత ఏడాది మక్కసాగు ఊహించని విధంగా సుమారు 91 వేల ఎకరాల్లో సాగుచేశారు. వరిసాగు దాదాపు 2 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే వానకాలంలో ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో జిల్లా వ్యవసాయశాఖ ఈ సంవత్సరం యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా ఆయారకాల పంటలు కలిపి 1,66,319 ఎకరాల్లో సాగుకావచ్చని అంచనా వేశారు. వరి సుమారు 1 లక్ష ఎకరాలు, మక్కసాగు మరో 50వేల ఎకరాల్లో సాగుకావచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా యాసంగి సాగు గణనీయంగా తగ్గింది.. అంచనాలో సగానికి సగం సైతం సాగు కాలేదు. దీంతో యాసంగి సీజన్లో పచ్చగా కనిపించే ప్రాంతాలు నేడు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా, యాసంగి తరువాత మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల లేకపోవడమే అని అధికారులు, రైతులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా 16 మండలాలు కేవలం సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఉన్నాయి. ప్రతిఏటా వానకాలం, యాసంగి సీజన్లో రైతులు ఎక్కువగా సాగర్ నీటిమీద ఆధారపడి సాగు చేస్తున్నారు. సాగర్ కాలువ పరిధిలో సుమారు 1.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. మైదాన ప్రాంతంలో చెరువులు, కుంటలు, బోరుబావుల కింద మరో 2 లక్షల ఎకరాలు సాగు జరుగుతున్నది. అయితే వానకాలం సీజన్లోనే ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు కనిష్ఠ స్థాయికి చేరాయి. వీటికితోడు నాగార్జునసాగర్ డ్యామ్లో సైతం సాగునీరు డెడ్స్టోరేజీకి చేరడంతో ఎడమ కాలువకు నీరు విడుదలకావని కొద్దిరోజుల క్రితమే సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో యాసంగి సాగు కేవలం బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉన్న ప్రాంతాల్లోనే రైతులు సాగు చేపట్టారు. దీనికి తోడు యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు (పంటల పెట్టుబడి) సైతం చాలామంది రైతులకు అందకపోవడంతో సాగు విస్తీర్ణంపై ప్రభావం కనపడుతున్నది. ఏదిఏమైనా రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు జరిగే ఖమ్మంజిల్లాలో తొలిసారిగా కనిష్ఠస్థాయిలో యాసంగి పంటలు సాగుకావడం విచారకరం.
గత సంవత్సరం యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 3,15,375 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వరి 2,14,892 ఎకరాలు, కంది 14 ఎకరాలు, మక్క 91,227 ఎకరాలు, జొన్న 340 ఎకరాలు, పెసర 3,463 ఎకరాలు, వేరుశనగ 554 ఎకరాలు, జనుము 426 ఎకరాలు, చెరుకు 3,371 ఎకరాల్లో సాగు చేశారు. ఇతర పంటలు మరో 800 ఎకరాల్లో సాగు చేశారు.
జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం నేటివరకు వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి సుమారు 50 వేల ఎకరాల్లో వివిధ పంటల సాగు జరిగింది. వీటిలో వరి 15,782 ఎకరాలు, మక్క 31,644 ఎకరాలు, పత్తి 2 ఎకరాలు, చెరుకు 12 ఎకరాలు, వేరుశనగ 370 ఎకరాలు, మినుము 287 ఎకరాలు, పెసర 1,612 ఎకరాలు, ఇతర పంటలు 150 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీటితోపాటు మరో 159 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. మొత్తంగా 50,006 ఎకరాల్లో ఈ యాసంగి సీజన్లో పంటల సాగు జరుగుతున్నది.
ఖమ్మంజిల్లాలో యాసంగి సాగు ఈ ఏడాది రికార్డుస్థాయిలో తగ్గిపోయింది. గతేడాది వరకు 3 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగు కాగా.. ఈసారి కేవలం 50 వేల ఎకరాలకే పరిమితమైంది. జిల్లాలో మొత్తం 21 మండలాలకు 16 మండలాలు సాగర్ ఆయకట్టు పరిధిలోనే ఉన్నాయి. సాగర్ కాలువ పరిధిలో సుమారు 1.50 లక్షల ఎకరాలు, చెరువులు, కుంటలు, బోరుబావుల కింద 2 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. ఈ వానకాలం సరైన వర్షపాతం లేక భూగర్భజలాలు అడుగంటడం, నాగార్జునసాగర్లో సైతం నీరు లేకపోవడంతో ఈ యాసంగి సాగు 1,66,319 ఎకరాలకు అధికారులు అంచనా వేశారు.. అయితే అందులో సగానికి సగం సైతం సాగుకాకపోవడం గమనార్హం. రైతుబంధు(పంటల పెట్టుబడి) సైతం చాలామంది రైతులకు అందకపోవడం కూడా సాగు విస్తీర్ణంపై ప్రభావం పడింది. ఏదిఏమైనా ఖమ్మంజిల్లాలో ఇంత కనిష్ఠస్థాయిలో యాసంగి పంటలు సాగుకావడం ఇదే తొలిసారి.
యాసంగిలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి. ఈ సంవత్సరం సాగునీటి లభ్యత లేకపోవడం వల్ల జిల్లావ్యాప్తంగా యాసంగి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి సంబంధించి డైరెక్టు సీడ్ పద్ధతిలో సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం. కరివేద పద్ధతిలో వరిసాగు వల్ల సమయం, తక్కువ నీటివసతితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.