హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి నేపథ్యంలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పార్టీ నేతలతో కలిసి పెద్ది చిత్ర పటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. సుదర్శన్రెడ్డి పార్టీకి అందించిన సేవలను రావుల కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఆర్టీయూ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నాయకులు పీ నారాయణ, వేముల మారయ్య, ఆర్ పరమేశ్వర్, మహేశ్, సాయి, హరి, ప్రభాకర్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని రాంబాబు యాదవ్ నెమరేసుకున్నారు. పెద్ది మరణం బీఆర్ఎస్కు తీరనిలోటని బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా ఇన్చార్జి అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని బీఆర్ఎస్ ఎన్నారైల తరఫున నివాళులర్పించారు.