సర్కారు బడి పూర్వవైభవం సంతరించుకోనున్నది. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్ర మంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు మన బడి’లో 512 పాఠ శాలలను ఎంపిక చేశారు. సుమారు 50వేల మంది విద్యార్థులకు సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు అందు బాటులోకి రానున్నాయి.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని సర్కారు బడులు కార్పొరేట్ పాఠశాలలకు పోటీగా నూతన హంగులతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 10వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల్లో రూ.2 కోట్లను మినహాయించి వాటిని మన ఊరు-మనబడి కార్యక్రమానికి కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 512 పాఠశాలలను ఎంపిక చేశారు. సుమారు 50వేల మంది విద్యార్థులకు సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి.
– కల్లూరు రూరల్, జూన్ 14
ప్రస్తుతం జిల్లాలో చూస్తే ఎప్పుడో నిర్మించిన పురాతన భవనాల్లోనే విద్యార్థులకు విద్యాబోధన కొనసాగుతున్నది. వాటిలో చాలావరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందుకే మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులకు సురక్షిత తాగునీరు, తరగతి గదుల ఆధునీకరణ, రంగులు వేయడం, డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధన, మరుగుదొడ్ల పునరుద్ధరణ, దివ్యాంగులకు ప్రత్యేక తరగతి గదుల ఏర్పాటు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన
ఆంగ్ల మాధ్యమం చదువులకు ఆకర్షితులైన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు మధ్యలోనే పిల్లల చదువులను ఆపేస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు.
మండలంలో 23పాఠశాలలు ఎంపిక
కల్లూరు మండలంలో మొత్తం 23 పాఠశాలలను మన ఊరు- మన బడి కింద ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. కల్లూరు ప్రాథమిక పాఠశాలలో రూ.6.47 లక్షలు, నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో రూ.7 లక్షలతో పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇటీవల ప్రారంభించారు.
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
మన ఊరు-మన బడి కార్యక్రమంతో విద్యార్థుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారు. వారి భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నారు. విద్యార్థుల గుండెల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలుగన్న సమాజంలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతున్నది.
– సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య