ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలక సంస్థ, ఇల్లెందు పురపాలక సంస్థ.. రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నుంచి కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు (డీవీ) పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఖమ్మం నగర పాలక సంస్థను ఇతర మున్సిపాల్టీలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సారథ్యంలో నగరంలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఐఏఎస్ అధికారులు అరవిందకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇల్లెందు పట్టణాన్ని మరింతగా అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు.