భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ నోట భద్రాద్రి జిల్లా మాట వచ్చింది. చిన్నారుల్లో పోషకాహార లోపం దరిచేరని జిల్లాగా ఆయనతో ప్రశంసలందుకుంది. పోషకాహార లోపాన్ని అధిగమించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల జాబితాలో బెస్ట్గా స్థానం సంపాదించుకుంది. జాతీయస్థాయిలో 9వ ర్యాంకును సొంతం చేసుకుంది.
అసలే ఇది గిరిజన జిల్లా. పొరుగు రాష్ర్టాల నుంచి ఎక్కువగా ఆదివాసీలు వచ్చి నివాసం ఉండే అటవీ జిల్లా. ముఖ్యంగా అడవిలో ఉండే ఆదివాసీలు అక్కడ లభించే ఆహారపదార్థాలనే తింటారు. మరి వారి పిల్లలకు పోషకలోపాన్ని ఎలా నివారించాలి? ఇది అధికారులకు కత్తిమీద సామే. సహజంగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలంటే కేవలం అంగన్వాడీ కేంద్రాల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ పిల్లల తల్లులు వాటిపై దృష్టి పెట్టరు. తమకు అందుబాటులో ఆన్న ఆహారాన్నే తింటారు. దాని వల్ల పిల్లల్లో ఎక్కువగా పోషకలోపం కన్పిస్తోంది. ఇలాంటి పోషకలోపంతో బాధపడే చిన్నారులపై భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్వాడీల ద్వారా సరఫరా అయ్యే పోషకాహారం సక్రమంగా అందితేనే వారిలో పోషకలోపం పోతుందని గుర్తించి పిల్లలకు అందించే పౌష్టికాహారం క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో భద్రాద్రి జిల్లా దేశంలో 9వ స్థానంలో, రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషిని కలెక్టర్ల సమావేశంలో సాక్షాత్తూ ప్రధాని మోదీయే కొనియాడారు. దేశంలోని 748 జిల్లాలో 112 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా 2018లో గుర్తించి ఆయా జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో మూడు జిల్లాలను గుర్తించగా భద్రాద్రి జిల్లా నెంబర్ వన్స్థానం సంపాదించుకుంది.
గరిజన ప్రాంతంగా ఉన్న భద్రాద్రి జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గత సెప్టెంబర్లో 0 – 5 ఏళ్ల పిల్లలు 67,820 మంది ఉన్నారు. వీరిలో అతి తీవ్ర పోషకలోపం ఉన్నవారు 1,880 మంది ఉండగా, తీవ్ర పోషకలోపం ఉన్నవారు 4,227 మంది ఉన్నారు. ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా కలెక్టర్ అనుదీప్, డీడబ్ల్యూవో వరలక్ష్మి పోషకాహారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో మూడు నెలల్లో 72,156 మంది పిల్లలో అతి తీవ్రలోప పోషణ (సామ్) ఉన్న వారు 939కి చేరారు. తీవ్రలోప పోషణ (మామ్) ఉన్న వారు 2,590 మంది మాత్రమే ఉన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలో ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిన జిల్లా యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దేశంలో ఒక ఉదాహరణగా చూపించడం ఆ శాఖ అధికారులు, కలెక్టర్ అనుదీప్ కృష్టికి అద్దం పడుతోంది.
గిరిజన జిల్లాపై కలెక్టర్ అనుదీప్ పట్టు సాధించారు. పట్టుదలతో పనిచేస్తే దేనిలోనైనా ముందు వరుసలో ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంగన్వాడీల్లో అతి తీవ్ర పోషణలోపం ఉన్న వారికి డబుల్ రేషన్ ఫుడ్ ఇచ్చి వారికి చిరుధాన్యాల ఆహారం అందించారు. తల్లులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కృషి చేశారు. ఫలితంగా మంచి ర్యాంకు సాధించి ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నారు.
గిరిజన జనం, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దేశంలో 112 జిల్లాలను ఆంకాక్ష జిల్లాలుగా గుర్తించారు. ఈ జిల్లాల్లో 5 విభాగాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యం. అందులో విద్య, వైద్యం, న్యూట్రిషన్, నైపుణ్య, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, నీటి వనరులు వంటి 81 ఇండికేటర్లను గుర్తించి దేశంలో ర్యాంకింగ్ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి ర్యాంకింగ్లో అన్ని విభాగాల్లో భద్రాద్రి జిల్లా 16వ ర్యాంకులో ఉండగా, కేవలం అంగన్వాడీల్లో పోషకాహార లోపం నిరోధించడంలో 9వ స్థానాన్ని పొందింది.
పోషక లోపం కలిగిన పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించాం. వారికి ఎలాంటి ఆహారం ఇస్తే బాగుంటుందో తెలుసుకున్నాం. వారికి ప్రత్యేక మెనూ ఇచ్చాం. ఆహారం తీసుకున్నప్పటికీ చిన్నారుల్లో పోషకలోపం ఉంటే వారిని భద్రాచలం ఎన్ఆర్సీకి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేపించాం. వారిలో ఎదుగుదల లోపాన్ని గుర్తించి పోషకలోపాన్ని నివారించాం. దేశంలో భద్రాద్రి జిల్లాకు 9వ ర్యాంకు రావడం గర్వకారణం.