కల్లూరు, ఏప్రిల్ 21: అన్ని వర్గాల శ్రేయస్సే సీఎం కేసీఆర్ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకూ ప్రాధాన్యమిస్తోందని అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు వేదికగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్లనే అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రంజాన్ తోఫాను కల్లూరు జామియా మసీదు ఆవరణలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కల్లూరు మండలంలో 289 మంది ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 25న తన సొంత ఖర్చులతో మండలంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు చేయనున్నట్లు చెప్పారు. షాదీఖానా నిర్మాణానికి రూ.70 లక్షలు ప్రభుత్వం నుంచి మంజూరైనట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలకూ పథకాల లబ్ధి చేకూరుతోందన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు, హిందువులకు బతుకమ్మ చీరలు వంటి వాటిని ఏటా పంపిణీ చేస్తున్నట్లు గుర్తుచేశారు. అనంతరం మసీద్ కమిటీ సభ్యులంతా కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఘనంగా సత్కరించారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాలెపు రామారావు, బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, బోబోలు లక్ష్మణరావు, ఇస్మాయిల్, కొండూరి కిరణ్, ఎస్కే కమ్లీ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు సీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొని మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. 28 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా కల్లూరులోని సీపీఎస్ పాఠశాలకు మంజూరైన రూ.6.74 లక్షల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు. ఎంఈవో రాములు, హెచ్ఎం కృష్ణయ్య, ఎస్ఎంసీ చైర్మన్ పాశం అనురాధ, కొరకొప్పు ప్రసాద్, రామకృష్ణ, కాటంనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.