మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, దానిలో భాగంగానే మన ఊరు/బస్తీ-మన బడి రూపొందించారని, ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తిగా కొనసాగించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మన ఊరు-మన బడి ప్రత్యేక ఎజెండా అంశంగా కొనసాగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతగా జిల్లావ్యాప్తంగా 426 పాఠశాలలను ఎంపిక చేసిందన్నారు. ప్రధానంగా నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ బోర్డులు, వంట గదులు, ప్రహరీ, ఉన్నత తరగతులకు భోజనశాలలు, కొత్త గదుల నిర్మాణం, విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో తరగతుల బోధనకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి దాతలను ప్రోత్సహించేందకు ప్రజాప్రతినిధులు ముందుకురావాలని కోరారు. నాటి తరంలో 90శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు అమలు చేస్తున్నదని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మన ఊరు- మన బడిలో భాగంగా ఇప్పటికే 61శాతం మంది విద్యార్థులకు వసతులు సమకూరినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 326 పాఠశాలల్లో 44,741 మంది, పట్టణ ప్రాంతాల్లో 62 పాఠశాలల్లో 14,044 మంది మొత్తం 58,785 మంది విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. గుర్తించిన పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక అధికారులను కేటాయించనున్నట్లు తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల సమస్యలను వివరించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.