సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 12: ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఇంటింటి సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. మండలంలోని రామానగరం, గంగారం, బేతుపల్లి, తాళ్లమడ, రామగోవిందాపురం, నారాయణపురం గ్రామాల్లో సోమవారం ద్విచక్రవాహనంపై పర్యటించిన ఆయన.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 20 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం నారాయణపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి అద్భుత పథకాలు తెలంగాణలో తప్ప దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని వివరించారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల విషప్రచారాలు, ఎత్తుగడలతో విచిత్ర వేషగాళ్లు గ్రామాల్లోకి వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలుత గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల మహిళలు, నాయకులు, గ్రామస్తులు పూలు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, వీరేశం, వెంకటేశ్వరరావు, దొడ్డా హైమావతి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వర్రావు, కూసంపూడి రామారావు, వేల్పుల కళావతి, మందపాటి శ్రీనివాసరెడ్డి, పాకలపాటి శ్రీనివాసరావు, దుగ్గిరాల వాణి, శ్రీనివాసరావు, దేశిరెడ్డి రంగారెడ్డి, పాలకుర్తి సునీత, రవి, పిడుగు సత్యం, తుంబూరు కృష్ణారెడ్డి, కాశీం తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులకు శంకుస్థాపన
మండలంలోని నారాయణపురం, బేతుపల్లి, రామానగరం, తాళ్లమడ గ్రామాల్లోని అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు రూ.1.5 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నిర్మాణాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐదు మండలాల్లో గ్రామాల మధ్య ఉన్న అంతర్గత రహదారుల మరమ్మతులు, నూతన రహదారుల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ రూ.70 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.