చింతకాని, డిసెంబర్ 11 :తక్కువ పెట్టుబడి.. సాగు సులువు.. కూలీల ఖర్చు లేదు.. ఆరుతడి పంట.. అధిక దిగుబడి.. గిట్టుబాటు ధర.. వెరసి మక్క సాగుపై రైతులు మక్కువ పెంచుకుంటున్నారు.. వాణిజ్య పంటల సాగులో తెగుళ్లతో తిప్పలు పడడం కంటే మక్క సాగు చేసి మంచి లాభాలు పొందుతుండడంతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని తెలుపుతున్నారు చింతకాని మండల రైతులు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధర క్వింటాల్ రూ.1,960 కేటాయించి పీఏసీఎస్, మార్క్ఫెడ్ ద్వారా పంటను కొనుగోలు చేస్తుండడం వంటివి రైతులను మక్కసాగువైపు మళ్లిస్తున్నాయి. దళారీల దోపిడీ లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏటేటా మండలంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.. ఇప్పటికే ఈ ఏడాది 12వేల ఎకరాల్లో సాగు చేపట్టగా.. ఈ నెల 31 వరకు మొక్కజొన్న సాగుకు అనుకూల సమయమని అధికారులు చెబుతున్నారు. -చింతకాని, డిసెంబర్ 11
మొక్కజొన్న పంటకు చిరునామా మారింది చింతకాని మండలం. ఈ మండలంలో ఈ పంట విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. దిగుబడులు కూడా గణనీయంగా ఉంటున్నాయి. ఈ మండల రైతులు ఈ పంటను అన్ని సీజన్లలోనూ ప్రత్యామ్నాయ పంటగా సాగు చేస్తున్నారు. ధర కూడా అధికంగా పలుకుతోంది. ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండడం, నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో ఆయకట్టు అధికంగా ఉండడం, ఏప్రిల్ మాసం చివరి వరకు సాగు నీరు విడుదలవుతుండడం, వ్యవసాయ మార్కెట్కు కొద్దిదూరంలో ఉండడం, రోడ్డు రవాణా సౌకర్యం ఉండడం, వ్యవసాయానికి అనుకూలమైన నల్ల రేగడి, ఎర్ర నేలలు ఉండడం ఈ ప్రాంత ప్రత్యేకత. దీంతో ఎకరా మక్క సాగులో సుమారు 35 నుంచి 42 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఇక్కడి దిగుబడి పట్ల సీఎం కేసీఆర్ కూడా ఆశ్చర్యపోయారంటూ ఇటీవల లచ్చగూడెం రైతువేదిక ప్రారంభ సభలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గుర్తుచేయడం గమనార్హం.
పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ..
మొక్కజొన్న పంట సాగుకు కూలీల ఖర్చు తక్కువగా ఉండడంతోపాటు ఆరుతడి పంట కావడంతో లాభాలు కూడా పక్కాగా వస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. మధిర నియోజకవర్గంలోని ఇతర మండలాల రైతులు కూడా మొక్కజొన్న సాగువైపే మొగ్గు చూపుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతుండడం, ఖర్చులు అధికంగా అవుతుండడం వంటి కారణాల వల్ల చాలామంది రైతులు ఈ మొక్కజొన్న సాగువైపు మళ్లుతున్నారు. పైగా ఈ పంటకు సాగు వ్యయం తక్కువగా ఉండడంతోపాటు పర్యవేక్షణ కూడా పెద్దగా అవసరం లేకపోవడంతో ఎక్కువమంది రైతులు మక్కను సాగు చేస్తున్నారు. చాలామంది రైతులు తెగుళ్ల బెడద ఉన్న పత్తి వంటి పంటలను తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న సాగును మొదలు పెడుతున్నారు. వీటికి తోడు మొక్కజొన్న పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1960గా ఉండడం, స్థానిక పీఏసీఎస్లలో ప్రభుత్వమే మార్క్ఫెడ్ కోనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి నేరుగా కోనుగోలు చేస్తుండడం వంటివి రైతులను మక్కసాగువైపు మళ్లిస్తున్నాయి. పైగా దళారీల బాధ లేకుండా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే మొక్కజొన్న సాగుకు అనుకూల సమయమని అధికారులు చెబుతున్నారు.
పోటీపడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు..
మండలంలోని మొక్కజొన్న పంటను తెలుగు రాష్ర్టాల్లోని కోళ్లఫారాల యజమానులు, బీర్ల ఫ్యాక్టరీల యజమానులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు మించి వెచ్చిస్తున్నారు. గత యాసంగిలో రూ.2,250పైగా వెచ్చించి కొనుగోలు చేశారు.
ఏటేటా పెరుగుతున్న విస్తీర్ణం..
మండల విస్తీర్ణంలో సగభాగం అంటే సుమారు 24 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వానకాంలో సీజన్లోనూ మెట్ట రైతులు ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు వానకాలం సీజన్లో వరి పంటను కోయగానే అదే పొలంలో మక్క సాగును ప్రారంభిస్తుండడం విశేషం. ఈ పంటకు ఉన్న డిమాండ్ కారణంగా భూముల యజమానులు కూడా వానకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరు విధానాల్లో కౌల్లు తీసుకుంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా..
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా వ్యవసాయశాఖ సూచనల మేరకు స్థానిక రైతులు యాసంగిలో వరి మినహా మక్క, వేరుశనగ, మినుము, పెసర వంటి పంటలను అధికంగా చేస్తారు. ప్రస్తుత యాసంగిలో వరి వైపునకు వెళ్లకుండా వరి మడులలో మొక్కజొన్న, అపరాలు సహా ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. రైతుబంధు సమితి తరఫున కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
–కిలారు మనోహర్బాబు, రైతుబంధు సమితి మండల కన్వీనర్
సీజన్లో యూరియా కొరత రానివ్వం..
యాసంగిలో మక్కసాగు విస్తీర్ణానికి డిమాండ్ మేరకు యూరియాను సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను వివరిస్తున్నాం. ఇప్పటికే అన్ని గ్రామాల్లోని రైతులకు సరిపడా విత్తనాలు అందేలా వ్యవసాయ శాఖతో కలిసి సమష్టిగా ముందుకెళ్తున్నాం. మద్దతు ధరకు మించి కోనుగోళ్లు జరుగుతుండడంతో మక్క కోనుగోలులో మార్క్ఫెడ్ అవసరం లేకుండా పోతోంది.
–కొండపల్లి శేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, చింతకాని