అశ్వారావుపేట/ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 4 : విద్యార్థుల్లో మౌలిక సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు చదవడం రావాలనే సంకల్పంతో రీడ్ (రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్) ప్రోగ్రాం రూపొందించింది. 100 రోజుల ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమం నేటి నుంచి అమలు కానున్నది. ఇప్పటికే డీఆర్పీ (డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్ల)కు శిక్షణ ఇచ్చింది. ‘చదవండి.. ఆనందించండి’ అనే నినాదంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నది.
విద్యార్థుల్లో కనీస మౌలిక సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర విద్యాశాఖ ‘రీడ్’ (ఆర్ఈఏడీ-రీడ్ ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్) ప్రోగ్రాంను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని 100 రోజులపాటు అమలు చేసేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే డీఆర్పీలకు అవసరమైన శిక్షణ ఇచ్చాం. ప్రతి పాఠశాలలో ‘రీడ్’ ప్రోగ్రాంను ఉపాధ్యాయులు పకడ్బందీగా అమలు చేయనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇందులో భాగస్వాములైతే త్వరితగతిన ఫలితాలు అందుకుంటారు.
– నాగరాజశేఖర్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, కొత్తగూడెం
విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏర్పాటైనదే ఈ ప్రత్యేక కార్యక్రమం. దీనిలో విద్యార్థులు దారాళంగా చదివేలా చేయడంతోపాటు వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తాం. గ్రంథాలయ వారోత్సవం, మాతృభాషా దినోత్సవం వంటివి నిర్వహిస్తాం. వాటి ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తాం. ప్రధానోపాధ్యాయుడితోపాటు కాంప్లెక్స్ హెచ్ఎంలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు.
-బుగ్గినేని నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు