బోనకల్లు, ఫిబ్రవరి 1: రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ముదిగొండ మండలం మాధాపురంలో నిర్మించిన రైతువేదికను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. 92 శాతం రైతుబంధు సాయం సన్న చిన్నకారు రైతులకే అందుతోందని అన్నారు. వీరిలోనూ అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే ఉన్నారని వివరించారు.
గతంతో పోలిస్తే ఆహార వినియోగంలో పెనుమార్పులు వచ్చినందున దానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని సూచించారు. తెలంగాణలో పామాయిల్ పండిస్తామంటే కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదని విమర్శిచారు. ప్రపంచానికి సరిపడా పంటలు పండించగల సత్తా ఉన్న మన రైతులను కులమతాల పేరుతో చీలుస్తున్నారని, తద్వారా ఓట్ల లబ్ధిపొందాలని చూస్తున్నారని బీజేపీ పాలకులను విమర్శించారు. బీజేపీ పాలకులు తాము పెంచి పోషించిన కార్పొరేట్లకు దేశ సంపదనంగా కట్టబెట్టారని ఆరోపించారు. ప్రధాని మోదీ స్నేహితుడైన అదానీ వల్ల నేడు దేశం రూ.లక్షల కోట్ల కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘పొంగులేటి’ విమర్శలను ఖండిస్తున్నాం
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఫైర్ అయ్యారు. మండలంలోని మాధాపురం రైతు వేదిక ప్రారంభం అనంతరం రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల పొంగులేటి ఆత్మీయ సభల పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నామన్నారు. నిన్నటి వరకూ తమతో ఉన్నప్పడు ప్రభుత్వ వైఫల్యాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కరెంటు గురించి మాట్లాడానికి పొంగులేటికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటిదాకా తమ కలిసి ప్రయాణం చేసినప్పుడు తెలంగాణలో కనిపించిన కరెంటు.. ఇంతలోనే కన్పించలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం, రాజకీయ పార్టీల కోసం రైతులను బలిపెట్టడం సరికాదని అన్నారు.
వ్యవసాయానికి ఖమ్మం జిల్లా ఓ మ్యూజియం: అజయ్
వ్యవసాయానికి ఖమ్మం జిల్లా ఓ మ్యూజియం లాంటిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఏ కొత్త పంట వచ్చినా ఇక్కడి నుంచే మొదలవుతుందని గుర్తుచేశారు. పామాయిల్ పంటను మొదటగా పండించింది ఇక్కడేనని గుర్తుచేశారు. రైతులకు కొంచెం ప్రోత్సాహమిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం చాలా పెరిగిందన్నారు. గతంలో 2.70 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు.. సీతారమా ప్రాజెక్టు పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అన్నారు. తాను వ్యవసాయ విద్యలో పీజీ చేసినప్పటికీ తన కన్నా పెద్ద శాస్త్రవేత్త సీఎం కేసీఆర్ అని అన్నారు. అందుకే నిత్యం తెలంగాణ రైతుల గురించే ఆయన ఆలోచిస్తుంటారని గుర్తుచేశారు. కాగా, ఖమ్మం జిల్లాకు వ్యవసాయ కళాశాల కావాలని నిరంజన్రెడ్డికి కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
రైతుల కోసమే రైతు వేదిక: తాతా మధు
రైతులందరూ కూర్చొని పంటల సాగు, దిగుబడుల గురించి చర్చించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలను అందుబాటులోకి తెచ్చింని ఎమ్మె ల్సీ తాతా మధు పేర్కొన్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించే రైతులు ఖమ్మం జిల్లాలో మాత్రమే ఉన్నారని అన్నారు. జడ్పీ, టీఎస్ సీడ్స్, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరావు, కూరాకుల నాగభూషనం, కలెక్టర్ వీపీ గౌతమ్, రైతుబందు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, డీఏవో విజయనిర్మల, స్థాని క ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సామినేని హరిప్రసాద్, తుపాకుల యలగొండ స్వామి, రాధ, శిరీష, శ్రీనివాసరావు, దివ్యమనీష, మౌనిక, వంశీ, వాచేపల్లి లక్ష్మారెడ్డి, బత్తుల వీరారెడ్డి, మీగడ శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణరెడ్డి, రవీందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు.