మామిళ్లగూడెం/ కొత్తగూడెం క్రైం, జూలై 28: సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని, వారి బారి నుంచి ప్రజల సొమ్ముని కాపాడేందుకు కృషిచేయాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా గురువారం జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలను అదుపు చేయడంలో అధికారులు, సిబ్బంది మరింత కృషి చేయాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అవగాహన కల్పించాలని ఆదేశించారు.
నేరగాళ్లకు తప్పనిసరిగా శిక్ష పడేలా ప్రతి ఒక్క అధికారి శ్రమించాలని సూచించారు. పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అంతా కృషి చేయాలన్నారు. కింది స్థాయి అధికారులు, సిబ్బంది బాధ్యతగా పని చేసేలా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ ప్రకారం అధికారులందరూ తమ విధులను నిర్వర్తించేలా నిత్యం వారికి తగు సూచనలందించాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి త్వరితగతిన చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అవసరమైతే వారిపై పీడీ యాక్టును నమోదు చేయాలని సూచించారు. ఇటీవల వరదలు వచ్చిన నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అధికారులు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. భద్రాద్రి నుంచి ఎస్పీ వినీత్, డీఎస్పీ నందిరామ్, సీఐలు ఉపేందర్, మడిపెల్లి నాగరాజు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, ఖమ్మం నుంచి విష్ణు ఎస్ వారియర్, ఏడీసీపీలు శబరిశ్, సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేశ్, వెంకటస్వామి, ఆంజనేయులు, రెహమాన్, రవి, బాబూరావు పాల్గొన్నారు.