ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 17: ఎవరూ ఊహించని రీతిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రైతులు మిర్చిపంటను తీసుకొచ్చారు. గడిచిన మూడు రోజులు మార్కెట్కు వరుస సెలవులు రావడంతో తిరిగి సోమవారం యార్డులో క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. వరుస సెలవుల ప్రభావం, ఆంధ్రా ప్రాంతం నుంచి రైతులు, వ్యాపారులు భారీగా పంటను తీసుకురావడంతో జెండాపాట సమయానికి సుమారుగా 70 వేల బస్తాలు యార్డుకు వచ్చి ఇసుకేస్తే రాలనంతగా కన్పించాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఆయా జిల్లాల నుంచి రైతులు మార్కెట్కు పంటను తీసుకొచ్చారు. అయితే అర్ధరాత్రి వరకు యార్డు ముందువైపు పూర్తిగా నిండిపోవడంతో ఆ తరువాత పంటను తీసుకొచ్చిన రైతులు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లపైనే బస్తాలను దించారు. దీంతో ఉదయం వేళ ట్రాలీ అసోసియేషన్ వాహనాలు యార్డులోకి పోలేక, పోయిన వాహనాలు లోడ్ చేసుకొని బయటకు రాలేక ఇబ్బంది పడ్డాయి.
సోమవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠ ధర రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.21 వేలు, కనిష్ఠ ధర రూ.17,500, తాలురకం గరిష్ఠ ధర రూ.14.500 చొప్పున పలికాయి. వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్దదైన గుంటూరు వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంటకు ఆశించిన ధరలు పలుకకపోవడం, అక్కడి ఖరీదుదారులు పేచీలు పెడుతుండడం వంటి కారణాలతో అక్కడి రైతులు విసుగుచెందుతున్నారు. ఖమ్మం మార్కెట్లో ధర నిలకడగా ఉండడంతో ఆంధ్రాలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటను భారీగా తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా పంట చివరి దశకు చేరడం, మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండడంతో రైతులు కూడా తమ పంటను కోల్డ్స్టోరేజీలకు తరలించకుండా నేరుగా మార్కెట్లో విక్రయానికి తీసుకొస్తున్నారు. యార్డుకు భారీగా పంట రావడంతో అప్రమత్తమైన చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత.. సెక్రటరీ ఆర్.మల్లేశంతో కలిసి క్రయవిక్రయాలను పరిశీలించారు. అయితే పంట ఎక్కువగా రావడంతో రాత్రి వరకు తోలకాల ప్రక్రియ కొనసాగింది.