ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 5: రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి భారీగా వచ్చింది. దీంతో యార్డంతా మిర్చి బస్తాలతో పోటెత్తింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల నుంచి రైతులు తమ పంటను భారీ మొత్తంలో తేవడం ప్రారంభించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం, మార్కెట్లో పంటకు ధర నిలకడగా ఉండడం వంటి కారణాలతో ఇదే అదునుగా భావించిన రైతులు.. పంటను మార్కెట్కు తీసుకొచ్చారు. ఒకరోజు ముందుగానే పంట రావడంతో మార్కెట్ కమిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం జెండాపాట సమయానికి రికార్డు స్థాయిలో 50 వేల బస్తాలు వచ్చాయి. దీంతో మిర్చియార్డంతా ఎర్రబంగారం బస్తాలతో కిక్కిరిసింది. ఈ సంవత్సరంలో అత్యధిక పంట రావడం ఇదే తొలిసారి. అనంతరం జరిగిన జెండాపాటలో క్వింటాకు రూ.21,600 చొప్పున గరిష్ఠ ధర పలికింది. మధ్య ధర రూ.19,500, కనిష్ఠ ధర రూ.14 వేలుగా నిర్ణయించి ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు.
అదేవిధంగా తాలురకం పంటకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.12 వేలు పలికింది. మార్కెట్కు వచ్చిన పంట అత్యధికంగా నాణ్యమైనది కావడంతో ఖరీదుదారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం దాకా ఖరీదులు కొనసాగాయి. భారీగా యార్డుకు పంట రావడంతో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్.. గ్రేడ్ టూ అధికారి బజార్తో కలిసి యార్డులో క్రయవిక్రయాలను పరిశీలించారు. కాంటలు, తోలకాలు సకాలంలో జరిగేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి తోలకాల ప్రక్రియ ముగిసింది. దీంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ.. పంట తాకిడి పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మార్కెట్ కమిటీ పూర్తి సిబ్బందిని, అధికారులను మిర్చి యార్డులో విధుల్లో ఉంచామని చెప్పారు.