ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 7: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిర్చి వస్తాలు వచ్చినట్లయింది. మిర్చి బస్తాలు పెద్ద మొత్తంలో తెచ్చిన వారిలో ఖమ్మంతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులు ఎక్కువమంది ఉన్నారు. ఇటీవలి వరుస సెలవుల తరువాత తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతుండడం, మరో నాలుగు రోజుల పాటు మార్కెట్కు సెలవులు రావడం వంటి కారణాలతో రైతులు తమ పంటను భారీగా తేవడానికి కారణంగా ఉంది. ఉదయం జెండాపాట సమయానికే సుమారుగా 60 వేల బస్తాలు వచ్చాయి. దీంతో మిర్చియార్డంతా ఎర్రబంగారం బస్తాలతో కిక్కిరిసింది.
అనంతరం జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.22,300 పలికింది. అదే విధంగా మధ్య ధర రూ.20 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. అదే విధంగా తాలు రకం పంటకు క్వింటాకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.12 వేలు, మధ్య ధర రూ.11 వేలు, కనిష్ఠ ధర రూ.9 వేల చొప్పున పలికాయి. రెండు రోజుల క్రితం ఇదే మార్కెట్లో మిర్చికి క్వింటాకు రూ.21,500 ధర పలుకగా రెండు రోజుల్లోనే మరో రూ.800 ధర పెరిగింది. దీంతో రూ.22 వేల మార్క్ దాటింది. యార్డుకు భారీగా మిర్చి బస్తాలు వచ్చినప్పటికీ కార్మికులు, ట్రాలీ కార్మికులు తమ పనులు వేగవంతం చేయడంతో సాయంత్రంలోగా కాంటాలు, తోలకాల ప్రక్రియ పూర్తయింది.