Khammam | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కాసుల పంట పండిస్తున్నది. సెస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్లను రాబట్టింది.. రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఏఎంసీకి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించగా ఇప్పటివరకు రూ.21.97 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించే దశగా పయనిస్తున్నది. ఆదాయంలో ఏఎంసీ రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలుస్తుండగా మున్ముందు మొదటి స్థానంలో నిలిపేందుకు పాలకవర్గం కృషి చేస్తున్నది.
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 26: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యానికి చేరువులో ఉన్నది. ప్రస్తుతం ఆదాయంలో ఏఎంసీ రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉంది. మున్ముందు మొదటి స్థానంలో నిలిపేందుకు పాలకవర్గం కృషి చేస్తున్నది. రాష్ట్ర మార్కెటింగ్శాఖ రూ.25 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటివరకు రూ.21.97 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించే దశగా పయనిస్తున్నది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మార్కెట్లో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు, మార్క్ఫెడ్ పెసర, కంది కొనుగోలు కేంద్రాల ఊసు చేయలేదు. పత్తికి మద్దతు ధర పెరిగినప్పటికీ కేంద్రం సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మార్కెట్కు అదనపు ఆదాయం లేకుండా పోయింది. ఈ సంవత్సరం పత్తికి సీసీఐ మద్దతు ధర పెంచినప్పటికీ, ప్రైవేట్ మార్కెట్లోనే వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడంతో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు తెరమరుగయ్యాయి.
మార్కెట్కు ఎక్కువ ఆదాయం మిర్చి కొనుగోళ్ల నుంచే వస్తుంది. ఎందుకంటే అన్ని పంటల కంటే ఎక్కువ ధర పలికేది మిర్చికి మాత్రమే. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు మార్కెట్ రూ.22 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏటా మార్చిలో మిర్చి క్రయవిక్రయాలు జోరుగా సాగుతాయి. ఒక్క మార్చి నెలలోనే ఏటా సుమారు రూ.3 కోట్ల ఆదాయం వస్తుంది. దీనికి తోడు ఖరీదుదారుల నుంచి పెండింగ్ పన్ను వసూలు చేస్తే మార్కెట్ రూ.26 కోట్ల నుంచి రూ.27 కోట్ల ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉందనేది నిపుణుల మాట.
ఏఎంసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్ పూర్తయ్యే నాటికి అపరాలు, వాణిజ్య పంటలకు మంచి ధరలు పలికాయి. పెసరకు మద్దతు ధర క్వింటాకు రూ.7,275, కందికి క్వింటాకు రూ.6,300 పలికింది. ప్రైవేట్ వ్యాపారులు పోటీపడి మరీ పంటలు కొనుగోలు చేశారు. మరోవైపు పత్తి, మిర్చి పంటల ధరలూ బాగానే ఉన్నాయి. పత్తి క్వింటాకు మద్దతు ధర రూ.6,025 పలికింది. ప్రస్తుతం పత్తి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతున్నది. గతేడాదితో పోలిస్తే క్వింటాల్ ఒక్కింటికి రూ.3,500- 4 వేల ధర పెరిగింది. మిర్చికి మద్దతు ధర లేనప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు రూ.20 వేలకు పైగా పలుకుతున్నది. గత సంవత్సరం క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18వేలు మాత్రమే పలికింది. వీటితో పాటు హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఆదాయమూ గతేడాది కంటే మెరుగ్గా ఉంది. సకాలంలో ఖరీదుదారులు మార్కెట్కు సెస్ చెల్లిస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆదాయాన్ని మరింత పెంచే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. ఆదాయపరంగా మార్కెట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే పనిలోపడ్డాం. వ్యాపారులు, రైతుల సహకారంతో క్రయక్రయ విక్రయాలు బాగా జరుగుతున్నాయి. ఈ మేరకు సెస్ వసూలవుతున్నది. మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఏఎంసీని మున్ముందు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం.
– దోరెపల్లి శ్వేత, చైర్పర్సన్, ఖమ్మం ఏఎంసీ