ప్రజల సహకారంతో సంపూర్ణ స్వచ్ఛత
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం..
హరితహారంతో గ్రామంలో కొత్త అందాలు
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం
ఉత్తమ పంచాయతీ అవార్డు కైవసం
ఆదర్శం మర్కోడు పంచాయతీ
ఆళ్లపల్లి ఏప్రిల్1:అవును.. ఆ పల్లె రూపు మారింది.. ప్రగతి దరి చేరింది. అతుకుల బతుకుల బాధ తీరింది.. గతుకుల దారుల వ్యధ తీరింది. అద్దంలాంటి రహదారి వచ్చింది.. వీధుల్లో మురుగు బాధ తొలగింది. చెత్తకుప్పల సమస్య దూరమైంది. డంప్యార్డు, కంపోస్ట్ షెడ్తో స్వచ్ఛత దిశగా అడుగులు వేసింది. తీరొక్క మొక్కలతో ప్రకృతివనం ఆహ్లాదం పంచుతున్నది. సకల వసతులతో రైతువేదిక.. సువిశాలమైన స్థలంలో వైకుంఠధామం నిర్మించడంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’తో ఆళ్లపల్లి మండలంలోని మర్కోడు పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి.
మర్కోడు గ్రామ పంచాయతీలో మొత్తం 310 కుటుంబాలుండగా.. 2544 మంది జనాభా ఉన్నారు. గ్రామ పంచాయతీ, పాలకవర్గం, ప్రజల సమష్టి కృషితో జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలిచి పంచాయతీ ఉత్తమ అవార్డు సొంతం చేసుకున్నది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలతో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రగతితో గ్రామంలో సకల వసతులు సమకూరాయి. ఇంటింటికీ సంక్షేమ ఫలాలతోపాటు పారిశుధ్య చర్యలతో స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో గ్రామానికి కొత్త అందాలు సంతరించుకున్నాయి.
ఉత్తమ పంచాయతీ అవార్డు
గ్రామస్తులు, వార్డు సభ్యుల సహకారంతో గ్రామం అభివృద్ధిలో పయనిస్తున్నది. జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిచి ఉత్తమ పంచాయతీగా అవార్డును కైవసం చేసుకున్నది. వాటర్ ట్యాంకర్ సహాయంతో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పడుతూ పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. హరితహారంలో భాగంగా గ్రామ రహదారులకు ఇరువైపులా 3,200 మొక్కలు, పల్లె ప్రకృతి వనాల్లో 12 వేల మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఓడీఎఫ్ సాధించింది..
గ్రామ పంచాయతీకి మంజురైన ప్రభుత్వ నిధులతో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించి డంపింగ్ యార్టుకు తరలిస్తూ పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. పాలకవర్గం, అధికారులు ప్రత్యేక చొరవతో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించడంతో వంద శాతం ఓడీఎఫ్ గ్రామంగా నిలిచింది. లూప్లైన్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. విద్యుత్ శాఖ అధికారులు వాటిని సరిచేసి అదనంగా 33 విద్యుత్ స్తంభాలు, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామ నర్సరీల్లో 3 వేల మొక్కలు పెరుగుతున్నాయి. రెండేండ్లలో ఏటా వందశాతం ఇంటి పన్నులు వసూలు చేశారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.56 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. గ్రామపంచాయతీ సీసీ రోడ్లు వేయించారు.