భద్రాచలం/పర్ణశాల, డిసెంబర్ 22 : శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి తెప్పోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్ర్తోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గోదావరి తీరంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి వైభవోపేతంగా తంతు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, వైదిక సిబ్బంది సమక్షంలో ఈ ఉత్సవాన్ని కనుల పండువగా జరిపారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోనూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తుల రాకతో గోదావరి తీరం జనసంద్రమైంది.
తొలుత స్వామివారికి గర్భగుడిలో దర్బార్ సేవను నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, జయజయ ధ్వానాల నడుమ, కళ్లు మిరుమిట్లు గొలిపే పటాకుల మోతల నడుమ స్వామివారిని పల్లకిలో కొలువు తీర్చి వేదిక వద్దకు తీసుకొని వచ్చారు. పుణ్యజలాలతో వేదికను సంప్రోక్షణ చేశారు. సరిగ్గా 6.01 గంటలకు హంస వాహనం జలవిహారానికి బయలుదేరింది. రామయ్య తండ్రి ఐదుసార్లు గోదావరిలో జలవిహారం చేశారు. ఆ సుందర, కమనీయ దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దంపతులు, కలెక్టర్ ప్రియాంక ఆల, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో మంగీలాల్, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ తదితరులు స్వామివారికి పూజలు చేశారు.
శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆలయంలో శనివారం భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకున్న వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్త రామదాసు కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 3 గంటలకు అంతరాలయంలోని మూలవరులకు నిర్వహించే ప్రత్యేక అభిషేకంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ దంపతులు పాల్గొంటారు.