సత్తుపల్లి టౌన్/ వైరా రూరల్, మే 17: అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఆగం చేసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ర్టాలు ఇచ్చే పన్నులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ర్టాలన్నింటికంటే తెలంగాణ నుంచే కేంద్రానికి అత్యధికంగా నిధులు పన్నుల రూపంలో వెళ్తున్నాయన్నారు. కానీ కేంద్రం నుంచి మాత్రం తెలంగాణకు అత్యల్పంగా నిధులు వస్తున్నాయని అన్నారు.
తెలంగాణపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపుతుందో అనేందుకు ఈ నిధులే ఉదాహరణ అని అన్నారు. రాష్ర్టాలు కలిస్తేనే దేశం అవుతుందన్న విషయం కేంద్రం గుర్తుంచుకోవాలని సూచించారు. సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్లో మంగళవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రం సాధించుకోవడం ఒక అదృష్టమైతే దానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం మరో అదృష్టమని అన్నారు. దేశంలో రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఎంత అన్యాయం చేస్తోందో రైతులందరూ గమనిస్తున్నారని అన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లోనూ 24 గంటల ఉచిత కరెంటు అందడంలేదని, రూ.2 వేల పింఛన్లు ఇవ్వడంలేదని గుర్తుచేశారు. అన్ని వర్గాల సంక్షేమ సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమైందని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేని కొందరు పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సబ్సిడీపై జీలుగు విత్తనాలను ఈ వేదిక ద్వారా రైతులకు అందజేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు నల్లమల వెంకటేశ్వరరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా హైమావతి శంకర్రావు, కూసంపూడి మహేశ్, కూసంపూడి రామారావు, తోట సుజలారాణి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, చల్లగుళ్ల కృష్ణయ్య, సూర్యనారాయణ, మీనన్, సుజాత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికీ పథకాలు..
ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైరా మండలంలో విప్పలమడక, ఖానాపురం, కొండకొడిమ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు రాష్ర్టాలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ తీర్మానాలు చేస్తున్నారంటే ఇక్కడ ఎంతటి అభివృద్ధి జరిగిందో అర్థమవుతోందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు నల్లమల వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, బీడీకే రత్నం, బాబురావు, మిట్టపల్లి నాగేశ్వరరావు, లాల్మహ్మద్, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, బాణాల వెంకటేశ్వరరావు, సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారాములు, కట్టా కృష్ణార్జున్రావు, వనమా విశ్వేశ్వరరావు, మోటపోతుల సురేశ్, వెంకటపతిరాజు, అరుణ తదితరులు పాల్గొన్నారు.