భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం, జూలై 18: భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. దుమ్ముగూడెం, చుంచుపల్లి, పినపాక మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెంలో 45 మిల్లీమీటర్లు, పినపాకలో 35, చుంచుపల్లిలో 50, అశ్వాపురంలో 25, ఆళ్లపల్లిలో 18, గుండాలలో 15 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా జిల్లాలో సగటున 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గడిచిన పది రోజులుగా మోస్తరు జల్లులు పడుతుండడం, మూడు రోజులుగా జోరు వాన కురుస్తుండడంతో తమ పొలాల్లో నాట్లు వేసుకునేందుకు భద్రాద్రి జిల్లా రైతులు సిద్ధమవుతున్నారు. చుంచుపల్లి మండలంలో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి, ఇల్లెందు, పినపాక, పర్ణశాల, అశ్వారావుపేట, అశ్వాపురం మండలాల్లో పొల్లాలోకి నీరు చేరింది. వాతావరణ పరిస్థితిని బట్టి నార్లు వేసుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. భారీ వర్షం కురిస్తే మాత్రం నాట్లు, పత్తి విత్తనాలు వేయవద్దని సూచిస్తున్నారు.
ఖమ్మం జిల్లాపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. దీంతో గడిచిన రెండు మూడు రోజులుగా చెదురుమదురు జల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే సాగు చేసిన అపరాలు, వాణిజ్య పంటల సాగుకు వరుణదేవుడు ప్రాణం పోసినట్లయింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా వాన ముసురు కురిసింది. గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 8.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుబల్లి మండలంలో 21.2 మిల్లీమీటర్లు, సింగరేణి మండలంలో 12 మి.మీ, కామేపల్లిలో 11 మి.మీ, రఘునాథపాలెంలో 10.8 మి.మీ, ఏన్కూరులో 10.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్కు సంబంధించి 2 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. జూలై చివరి నాటికి దాదాపుగా విత్తనాలు పూర్తిగా నాటుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తోడు వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. వానకాలం సీజన్కు సంబంధించి మంగళవారం నాటికి ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 2,03,392 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వీటిల్లో అత్యధికంగా పత్తి సుమారుగా 1,35,156 ఎకరాలు, వివిధ పద్ధతుల ద్వారా వరి 13,685 ఎకరాల్లో సాగవుతోంది. ఇక చెరుకు 346 ఎకరాలు, మక్క 467 ఎకరాలు, పెసర 5,498 ఎకరాలు, ఇతర పంటలు మరో 7,500 ఎకరాలు, మరో 10 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలను రైతులు సాగు చేస్తున్నారు. వీటితోపాటు మరో 91,490 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరినారుమళ్లు పోసుకున్నారు.