బొగ్గుట్టగా పేర్గాంచిన ఇల్లెందు సింగరేణికి పురిటిగడ్డ.. ఇక్కడి గనులు ‘నల్ల బంగారపు’ నిధులు.. కోల్ ఇండియా ఏర్పాటుకు పునాదులు వేసిన ఈ ప్రాంతం దశాబ్దాల పాటు వెనుకబాటులోనే ఉంది.. ఇక్కడ నివసించే గిరిజనుల సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందాన పేరుకుపోయేవి. వాగులపై వంతెనలు లేకపోవడంతో రోడ్డుపై వరద ప్రవహించేది.. వానకాలంలో ఏజెన్సీకి రవాణా సౌకర్యాలు స్తంభించిపోయేవి.. అడవి బిడ్డలు తాగునీటి కోసం వాగులు, చెలిమలపై ఆధారపడేవారు. కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి బావుల వద్ద నీరు తెచ్చుకునేవారు.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి.. చిరకాల వాంఛ అయిన బస్ డిపో కల నెరవేరింది.. గ్రామ గ్రామానికి లింక్, అంతర్గత రహదారులు వచ్చాయి.. మిషన్భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది.. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ సాధ్యమైంది.. పంటలకు 24 గంటల ఉచిత, కరెంట్, రైతు రుణమాఫీ,రైతుబీమా, రైతుబంధు పథకాలతో రైతులకు ఎంతో మేలు జరిగింది.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాన్ని సుమారు రూ.1,400 కోట్ల నిధులతో అభివృద్ధి చేసింది.. బొగ్గుట్ట ప్రగతి ప్రస్థానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
అన్నిరంగాల్లో ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి
ఇల్లెందు, ఏప్రిల్ 28: ఇల్లెందు నియోజకవర్గం దశాబ్దాల పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వలస పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి, వివక్షకు గురైంది.. నాటి ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల పాటు పాలించి నియోకజవర్గ అభివృద్ధికి కేవలం వందల కోట్లు ఖర్చు చేయగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎనిమిదేండ్లలో ప్రభుత్వం అభివృద్ధి పనులకు సుమారు రూ.1,400 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, పల్లె ప్రగతి, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ, పంటలకు 24 గంటల పాటు కరెంట్ వంటివి ప్రజలకు మేలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా కృషి చేశారు.
ఎఫ్ఎస్టీపీతో పర్యావరణానికి మేలు..
పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇల్లెందు పట్టణంలోని బైపాస్ రోడ్డులో రూ.7.50కోట్లతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించింది. మున్సిపల్ సిబ్బంది వ్యక్తిగత, ప్రజా మరుగు దొడ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను నేరుగా ప్లాంట్కు తరలించి ఎరువులు తయారు చేస్తున్నారు. జిల్లాలోనే ఇది మొట్టమొదటి ఎఫ్ఎస్టీపీ. అలాగే పట్టణంలో డంపింగ్యార్డ్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులు సిద్ధం చేస్తున్నారు. ఎరువులను రైతులకు విక్రయించి మున్సిపాలిటీ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.
ఆరు దశాబ్దాల కల ఇల్లెందు బస్ డిపో..
ఇల్లెందులో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఏజెన్సీవాసులు ఆరు దశాబ్దాలుగా కోరుతున్నారు. కానీ ఏ నాయకుడూ డిమాండ్ను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అజయ్కుమార్ సహకారంతో మినీ బస్ డిపో వచ్చేలా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా బస్ డిపోలు ఏర్పాటు చేసే పరిస్థితి లేకున్నా ఇల్లెందుకు బస్ డిపోను తీసుకొచ్చారు. మంత్రి కేటీఆర్ శంకస్థాపన చేశారు. రూ.3.50 కోట్లతో డిపో నిర్మాణం జరుగుతున్నది. త్వరలో డిపోను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
‘మిషన్’ సక్సెస్..
ఎనిమిదేళ్ల కింద చెరువులు నెర్రెలు బారి కనిపించేవి. దశాబ్దాల పాటు చెరువులో పూడిక తీయకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం ఏటికేడు తగ్గిపోయేది. చెరువు కట్టలు పటిష్టంగా లేకపోవడంతో వానకాలంలో గండ్లు పడేవి. పంటలు ముంపునకు గురయ్యేవి. రైతులు నష్టాల పాలయ్యేవారు. తెలంగాణ వచ్చిన తర్వాతే చెరువులకు జల కళ వచ్చింది. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసి చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలను పటిష్టం చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వం రూ.121.24 కోట్ల నిధులతో 336 చెరువులను బాగు చేసింది. చెరువు మట్టిని పొలాలకు తరలించింది. దీంతో రైతుల పెట్టుబడి ఎకరానికి రూ.2,500- రూ.3,750 వరకు ఆదా అవుతున్నది. భూగర్భ జలాలు 69 శాతం నుంచి 92శాతం పెరిగాయి. చెరువుల్లో చేపలు పెంచి, వాటిని విక్రయించి మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.
ప్రభుత్వాసుపత్రికి మహర్దశ..
ఇల్లెందులోని ప్రభుత్వాసుపత్రి ఏజెన్సీవాసులకు వరం. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆసుపత్రి వైద్య విదాన పరిషత్లో విలీనం కావడంతో అభివృద్ధికి నోచుకున్నది. ఎమ్మెల్యే హరిప్రియ ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుతో నిధులు విడుదల చేయించారు. ఇప్పుడు ఆసుపత్రిలో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 10 మంది స్పెషలిస్టులు, ముగ్గురు సాధారణ వైద్యులు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఒకప్పుడు 100-200 నమోదైన ఓపీ ఇప్పుడు 500- 700కు చేరింది.
రూ.467 కోట్లతో రహదారులు..
ప్రభుత్వం నియోజకవర్గవ్యాప్తంగా రూ.467 కోట్లతో రోడ్లు నిర్మించింది. ఇప్పుడు ప్రతి పల్లెలో అంతర్గత రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు వచ్చాయి. ఇప్పటికే 80 శాతం రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 20శాతం రోడ్లకు నిధులు విడుదల కావాల్సి ఉన్నది. నిధులు విడుదల కాగానే అధికారులు రోడ్డు పనులు ప్రారంభించనున్నారు.
దశాబ్దాల కల నెరవేరింది..
ఇల్లెందుకు బస్ డిపో రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఏజెన్సీవాసుల కల నెరవేరింది. గిరిజనులు ఇల్లెందు నుంచి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రాత్రిళ్లు వెళ్లాలంటే రవాణా సౌకర్యం ఉండేది కాదు. డిపో ప్రారంభమైతే ఇక ఏ సమయంలోనైనా ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
– పిల్లి శ్రీనివాసరావు, ఎంఈవో, ఇల్లెందు
వేసవిలోనూ చెరువులకు జలకళ..
తెలంగాణ రాక ముందు చెరువులను ఎవరూ పట్టించుకోలేదు. కేసిఆర్ వచ్చినంక చెరువులో పూడిక తీయడంతో మాంచి ఎండా కాలంలోకూడా నీళ్లు ఉంటున్నాయి. రైతులకు ఎంతో మేలు చేసింది ప్రభుత్వం. పూడికి తీయడం మూలంగా పంట చేతికి వచ్చే వరకు కూడా చెరువులో నీళ్లుంటున్నాయి. గతంలో అయితే పంట మధ్యలోనే చెరువులో నీళ్లు అయిపోయేవి. తీవ్రంగా నష్టపోయేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– కొండ్రు లక్ష్మీనారాయణ, రైతు, రొంపేడు, ఇల్లెందు
ఒకప్పుడు ఆసుపత్రి దారుణంగా ఉండేది..
ఒకప్పుడు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి దారుణంగా ఉండేది. వైద్యులు అందుబాటులో ఉండేవారు కాదు. అవసరమైన మందులు ఉండకపోయేవి. ఇప్పుడు ఆసుపత్రి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆసుపత్రిలో వైద్యులు వైద్యం బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో అన్ని వసతులు వచ్చాయి. సీఎం కేసిఆర్ సారు ప్రజల కోసం మంచి చేస్తున్నారు. సర్కార్ దవాఖానలను బాగు చేస్తున్నారు.
– ఈసం హన్మంతు, రాఘబోయినగూడెం గ్రామం, ఇల్లెందు
రైతు బాంధవుడు కేసీఆర్
గతంలో వ్యవసాయ పెట్టుబడులకు వడ్డీవ్యాపారుల
నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునే వాడిని. పంట పండకపోతే చేసిన అప్పు డబుల్ అయ్యేది. ఆ అప్పు తీర్చడానికి సంవత్సరాలు పట్టేది. సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచించి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నరు. ప్రతి సీజన్కు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖాతాలో జమ చేయిస్తున్నరు. మాకు ఇక అప్పులు చేసే బాధ తప్పింది. రైతు బాంధవుడు కేసీఆర్.
– పెరుమాళ్ల కృష్టయ్య, రైతు, చల్ల సముద్రం, ఇల్లెందు
సీఎం కేసీఆర్ సహకారంతోనే..
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమైంది. ఏజెన్సీ ప్రాంతమన్నా, ఏజెన్సీ ప్రజలన్నా ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టం. గిరిజనుల చిరకాల వాంఛ అయిన బస్ డిపోను సాధించాం. నియోజకవర్గవ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైన్లు, వాగులపై వంతెనలు, చప్టాలు నిర్మించాం. ఇల్లెందు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. పట్టణ పౌరుల కోసం మార్కెట్లు నిర్మించాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇల్లెందు పట్టణంలో అధునాతన వసతులతో ప్రభుత్వాసుపత్రి నిర్మించాం. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
– ఎమ్మెల్యే బానోత్హరిప్రియా నాయక్
‘ఆసరా’తో బతుకు..
కొన్నాళ్ల క్రితం నా భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. నా ఆరోగ్యమూ అంతంతమాత్రంగానే ఉంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాను. ఉన్న ఒక్క కుమార్తెకు పెండ్లి చేశాను. నేను ఇంట్లో ఒక్కదానినే ఉంటాను. నాకు నెల నెలా ఠంచనుగా పింఛను, రేషన్ అందుతున్నది. వాటి ఆసరాతో బతుకుతున్నాను.
– గోళ్ల సుశీల, వితంతు పింఛనుదారు, ఇల్లెందు
కూలీ చేసిన చోటే దుక్కి దున్నుతున్నా..
మాది నిరుపేద కుటుంబం. కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే వాడిని. పనికి వెళితేనే మా ఇల్లు గడుస్తుంది. దుర్భర పరిస్థితిలో ఉన్నపుడు దళిత బంధు పథకం మా కుటుంబాన్ని ఆదుకున్నది. దళితబంధు పథకంలో భాగంగా నాకు రూ.10 లక్షలు విడుదలయ్యాయి. నేను ట్రాక్టర్ కొని నడుపుతున్నాను. ఒకప్పుడు కూలి పని చేసిన చోట ఇప్పుడు దుక్కులు దున్నుతున్నాను. ఇప్పుడు నేను ట్రాక్టర్ యజమానిని. దర్జాగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
– దేవి వెంకన్న, దళితబంధు లబ్ధిదారు, గౌరారం, బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా
‘మిషన్ భగీరథ’తో గోస తీరింది..
ఉమ్మడి పాలనలో నీటి కోసం గోస పడ్డాం. ఊరి శివారులోని వాగులో చెలిమలు తవ్వి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. ఆ నీరు తాగి చిన్నాపెద్దా రోగాల పాలయ్యేవారు. ఇక ఎండాకాలం వస్తే బోర్లు, బావులు ఎండి పోయేవి. తెలంగాణ వచ్చినంకనే నీటి కష్టాలు తీరినయి. ఇప్పుడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయి. నీటి గోస తీరింది.
– కోడిరెక్కల రాధ, విజయలక్ష్మి నగర్, ఇల్లెందు.
అన్ని రంగాల్లో ఇల్లెందు పట్టణ అభివృద్ధి..
ప్రభుత్వం ఇల్లెందు పట్టణ అభివృద్ధికి రూ.97.85 కోట్లు మంజూరు చేసింది. మున్సిపాలిటీ ఆ నిధులతో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసింది. మినీ ట్యాంక్ బండ్, చిల్డ్రన్స్ పార్క్, పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పారిశుధ్య వాహనాలను సమకూర్చింది. వీధి వ్యాపారుల కోసం మార్కెట్లు, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించింది. పార్కులు, రోడ్ల పక్కన, డివైడర్ల మధ్య మొక్కలు పెంచుతున్నది.