ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 59 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరు. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు 16,698 మంది పరీక్షలు రాయనున్నారు. సమస్యాత్మాక కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకుంటే ఒత్తిడి అధిగమించవచ్చు. శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభంకానున్నాయి.
పరీక్షల హాల్టిక్కెట్లను పొందేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఎలాంటి చిక్కులూ లేకుండా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఫీజులు చెల్లించలేదని, హాజరుశాతం తక్కువ ఉందని చెబుతూ ప్రైవేట్ కళాశాలలు పరీక్షల సమయంలో విద్యార్థులను ఇబ్బందులు పెడుతుండడాన్ని గమనించిన అధికారులు ఈ ధపా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే పద్ధతిని అమలు చేస్తున్నారు..
గురువారం డీఐఈవో కార్యాలయంలో డీఐఈవో రవిబాబు ఫ్లయింగ్ స్కాడ్స్, సిట్టింగ్ స్కాడ్స్తో సమావేశం నిర్వహించారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలని, లోపాలు లేకుండా సరిదిద్దాలని సూచించారు. ఒకే కేంద్రానికి వెను వెంటనే వెళ్లకుండా ప్రణాళిక ప్రకారం వెళ్లాలని స్పష్టం చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చూడడంతో స్కాడ్స్ది కీలకపాత్ర అని పేర్కొన్నారు. కొందరు ఇన్విజిలేటర్లు కొంతమంది విద్యార్థులకు అనూకులంగా ఉండే అవకాశాలు ఉంటాయని, వాటిని చేధించి అడ్డుకోవాలని సూచించారు. తనిఖీలు నిరంతరం జరగాలన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై టెలీకాన్ఫరెన్స్లో సూచనలు చేశారు.
విద్యార్థులు ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అవగాహన లేమి, ఆందోళన ఇతరత్రా కారణాలతో ఇంటర్ ఉత్తీర్ణత శాతం 50 శాతానికి మించట్లేదు. ప్రశ్నపత్రం ఎంత కఠినంగా వస్తుందో, పరీక్ష ఎలా రాయాలో, ఎన్ని మార్కులు వస్తాయో, తక్కువ మార్కులు వస్తే చదువులో వెనుకబడి పోతామేమో అనే ప్రశ్నలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంటాయి. జాగ్రత్తలు తీసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి భయాలూ ఉండవు.
పరీక్షకు వెళ్తున్న క్రమంలో బస్సుల్లోనో, ఆటోల్లోనో కొత్తగా చదవకూడదు. కొత్త అంశాల గురించి ఆలోచించకూడదు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నిర్ణీత సమయాల్లో మాత్రమే చదవాలి. రాత్రి పూట ఎక్కువ సమయం మెలకువతో ఉండకుండా చూడాలి. నిద్ర లేకుండా గడిపి ఒత్తిడికి గురి కావద్దు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉంచారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఎనిమిది గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. -సులోచనారాణి, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 5: భద్రాద్రి జిల్లాలో కేంద్రాల్లో జరగబోయే ఈ పరీక్షలకు ఫస్టియర్ నుంచి 10,114 మంది విద్యార్థులు, సెకెండియర్ నుంచి 10,217 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 16 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపర్చారు. 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 34 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 3 సిట్టింగ్ స్కాడ్లు, రెండు ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వైద్య సేవలు అందించేందుకు గాను 68 మంది ఏఎన్ఎంలకు విధులు కేటాయించారు. 15 పోస్టాఫీసుల నుంచి జవాబు పత్రాలను పంపనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోస్టల్, రెవెన్యూ అధికారుల సేవలు వినియోగించుకోనున్నారు.