– ఈఎంసీ కమిషనర్కు ఏఐటీయూసీ వినతి
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 10 : ఏదులాపురం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.750 పోస్టల్ ప్రమాద బీమాను మున్సిపాలిటీ నుండే కట్టించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీలో ఇటీవల కృష్ణ అనే ఎలక్ట్రిషన్ స్తంభం మీద నుండి ప్రమాదవశాత్తు కిందపడ్డాడని, అతడికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఉంటే వారికి ఉపయోగ పడుతుందని, అందువల్ల మున్సిపాలిటీయే వారికి నేరుగా బీమా చేయించాలన్నారు.
పిఎఫ్, ఈఎస్ఐ అమలవుతున్నా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే ఈఎస్ఐ హాస్పటల్లో వైద్యం అందుతుందని, చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ఈఎస్ఐ కు బిల్స్ రియింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే రావడం లేదన్నారు. కనుక ఈ విషయంపై స్పందించి కార్మికులకు మున్సిపాలిటీ నుండే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా పని ప్రదేశాలలో కార్మికులు ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ) జిల్లా ఉపాధ్యక్షులు అనుముల నరేందర్ రెడ్డి, విజయ్, కృష్ణ పాల్గొన్నారు.