ఖమ్మం, మార్చి 21 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్.. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని కస్బా బజార్, సుందరయ్య నగర్, ఖాజీపుర, శాంతినగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించడంతోపాటు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలెట్ తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా లేనిచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్యాన్లు, లైట్లు సరిపోను ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రహరీలు లేని పోలింగ్ కేంద్రాలకు వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకే లొకేషన్లో ఒకటి కంటే ఎకువ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నచోట క్యూ, రద్దీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు పాఠశాలను చూడగానే ఇందులో పోలింగ్ కేంద్రం ఉన్నదనే ప్రత్యేకత కనిపించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఎంఈవో శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దార్ సీహెచ్. స్వామి, అధికారులు తదితరులు ఉన్నారు.