పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే..
డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ రేగా
మణుగూరు టౌన్, జూన్ 9: దేశంలోని అనేక రాష్ర్టాల చూపు తెలంగాణ వైపే ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. అభివృద్ధిలో అంతలా దూసుకెళ్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మండలంలోని తోగ్గూడెంలో డబుల్ బెడ్రూం ఇళ్లను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సొంతింటిని నిర్మించి ఇవ్వడంతో పేదల మోముల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని అన్నారు. ఈ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో ఎంతోమంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇచ్చిందని అన్నారు. తహసీల్దార్ నాగరాజు, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సర్పంచ్ రజిత, టీఆర్ఎస్ నాయకులు ముత్యం బాబు, రామిరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, జీ.కోటేశ్వరరావు, ఎస్కే జావేద్పాషా పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి..
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. మండలలోని అశోక్నగర్, సాయినగర్, ముత్యాలమ్మ నగర్ ఏరియాలో గురువారం ఆయన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గుట్టమల్లారంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ కారం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి..
బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. మణుగూరులోని బాపనకుంటలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్య అందుతోందని, ‘మన ఊరు – మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని అన్నారు.