ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర్షానికే పరిమితమైంది. కురిసిన వర్షాలకు తిరుమలయపాలెం మండలం అతలాకుతలం అయ్యింది. జిల్లా సరిహద్దులో ఉన్న టీ పాలెం మండలంలో సైతం వర్షం ప్రభావం కనిపించింది.
జిల్లా వ్యాప్తంగా 16.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కేవలం తిరుమలయపాలెం మండలంలోనే మూడు గంటల పాటు కురిసిన వర్షానికి గాను 150.2 (15.2 సెంటీమీటర్లు) మిల్లీ మీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో 44.4 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 38.4 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 32.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాలలో కేవలం 10 మి.మీ లోపు మాత్రమే వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంతో పాటు, మరో ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలార్ట్ చేశారు. ఖమ్మం మినహా మిగిలిన జిల్లాలో బారీ నుంచి అతిభారీ వర్షాలు కురుశాయి. అయితే ఖమ్మం జిల్లాకు మాత్రం భారీ వర్షం ముప్పుతప్పినట్లయింది. దీంతో పెసర పంట సాగు చేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎగువన కురిసిన వర్షానికి గాను వరదల ప్రభావంతో టీ పాలెం, కూసుమంచి మండలాలలో చెరువులు మరోసారి మత్తడి దుంకాయి, పలు గ్రామాలకు ఉదయం వేళ రాకపోకలు నిలిచి పోయాయి. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో కలిసే ఆకేరు వాగు నుంచి భారీగా వరద రావడంతో మున్నేరు మరోమారు పొంగి ప్రవహించింది.