ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, గిరిజనులకు మణుగూరు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కయింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా ఏ ఆపదొచ్చినా.. గర్భిణులకు సుఖప్రసవాలు చేయాలన్నా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తూ భరోసా కల్పిస్తోంది. ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు పట్టుబట్టి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చేత మణుగూరు ఆస్పత్రిని వంద పడకలకు అప్గ్రేడ్ చేయించుకున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో మాదిరిగా అత్యాధునిక
వైద్య సౌకర్యాలు, ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని నియమించారు. ఆస్పత్రి అప్గ్రేడ్ అయినప్పటి నుంచి సుఖప్రసవాలు, అపెండిసైటిస్, మోకాలి మార్పిడి తదితర శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తూ మన్ననలు పొందుతున్నారు. అనతికాలంలోనే 500 శస్త్ర చికిత్సలు చేసి ఏజెన్సీవాసులకు దేవుళ్లయ్యారు.
– సారపాక, ఆగస్టు 13
సారపాక, ఆగస్టు 13: మణుగూరు నియోజకవర్గం భద్రాద్రి జిల్లాలో పూర్తి ఏజెన్సీ. అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా గిరిజనులు. చిన్న చిన్న రుగ్మతలైతే ఫర్వాలేదు ప్రజలు స్థానిక ఆరోగ్యకేంద్రం, పీహెచ్సీలకు వెళ్లి చికిత్స తీసుకుంటారు. ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే మాత్రం వారికి మణుగూరు పట్టణంలోని ప్రభుతాసుపత్రే దిక్కు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఇటీవల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశారు. దీంతో ఆసుపత్రికి అత్యాధునిక వైద్యసదుపాయాలు, శస్త్రచికిత్సకు అవసరమైన సరంజామా అందుబాటులోకి వచ్చాయి. వివిధ విభాగాలకు వైద్యులు నియమితులయ్యారు.
హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రిగా మారిన తర్వాత ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సాధారణ రుగ్మతలతోపాటు జటిలమైన ఆరోగ్య సమస్యలకూ వైద్యులు పరిష్కారం చూపుతున్నారు. ఆసుపత్రి ఏరియా సూపరింటెండెంట్ రాంప్రసాద్ నేతృత్వంలో వైద్యనిపుణులు ఇప్పటివరకు 24 గంటల కడుపునొప్పి, పేగుకు రంధ్రం, కడుపులో గడ్డలు, ట్రాన్సిలిటైస్ వంటి 500 ఆపరేషన్లు చేశారు. తాజాగా ఎముకల వైద్యనిపుణుడు రాంప్రసాద్ నేతృత్వంలో వైద్యబృందం అశ్వాపురం మండలం కొమ్ముగూడేనికి చెందిన ఎండీ కరీమున్నీసాబేగం అనే వృద్ధురాలికి ఆసుపత్రిలో మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యబృందానికి ప్రభుత్వ విప్ రేగాకాంతారావు, డీసీహెచ్వో రవిబాబు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడిని ఇకముందూ కొనసాగిస్తూ వైద్య సేవలను విస్తృతం చేయాలని సూచించారు.
ఆసుపత్రి అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు సగటు ఓపీ 700 ఉంది. ఇప్పటివరకు ఆసుపత్రిలో 500 అపరేషన్లు చేశాం. వీటిలో రెండు మూడు క్లిష్టమైన ఆపరేషన్లు ఉన్నాయి. ఇటీవల ఓ వృద్ధురాలికి మోకాలు మార్పిడి ఆపరేషన్ చేశాం.ఈ ఆపరేషన్ ప్రైవేటు ఆసుపత్రిలో అయితే రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. ట్రాన్సిలైటిస్ ఆపరేషన్ రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఉంటుంది. ఇలాంటి శస్త్రచికిత్సలన్నింటినీ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నాం.
– రాంప్రసాద్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, మణుగూరు
నేను ఎంతో కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నా. కొద్దిరోజులుగా నొప్పి చాలా ఎక్కువైంది. ఎన్నో ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగా. డబ్బులు ఖర్చు చేశా. కానీ ఎక్కడా నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. చివరికి మణుగూరు 100 పడకల ఆసుపత్రికి వచ్చా. వైద్యులు వైద్య పరీక్షలు చేసి మెకాలికి శస్త్రచికిత్స ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. మా కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.లక్షల్లో అయ్యే ఆపరేషన్ను వైద్యులు ఉచితంగా చేశారు. ఇంతమంచి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులో ఉంచినందుకు సర్కార్కు చేతులెత్తి మొక్కుతున్నా.
-ఎండీ నసీరున్నీసాబేగం, కొమ్ముగూడెం, అశ్వాపురం మండలం