వాన.. వరదలా మారింది. తెరిపివ్వకుండా జలధారలు కురిపించింది. రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలను నీటితో తన వశం చేసుకుంది. నేలనంతా తడిపి ముద్ద చేసింది. మూడో రోజూ తగ్గేదేలే.. అంటూ తన ప్రతాపాన్ని చూపించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 54.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 103 చెరువులు, భద్రాద్రి జిల్లాలో 500 చెరువులు మత్తడి పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ 24 గేట్లు, కిన్నెరసాని ప్రాజెక్టు 10 గేట్లు, తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. చర్ల మండలంలో వరద ప్రవాహం రోడ్లపైకి చేరడంతో పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
– భద్రాద్రి కొత్తగూడెం, జూలై 26(నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 26(నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం : వరుణ దేవుడు ఉమ్మడి జిల్లాపై ఆగ్రహించాడు. బుధవారం మూడు రోజూ తెరిపివ్వకుండా కురవడం తో జలాశయాలకు సమృద్ధిగా నీరు చేరింది. చెరువులు అలుగులు పారాయి. వాగులు పొంగి ప్రవహించాయి. జూన్ నెలలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ జూలై నెలలో ఆశించిన వర్షపాతం కంటే రెండు రెట్లు అధికంగా నమోదైంది. మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో అటు నగరవాసులతోపాటు ఇటు పలె ్లప్రజలు నానా యాతన పడుతున్నారు. వర్షాలకు వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. లోతట్టు ప్రాంతాల్లోని చేలల్లోకి వరద చేరుతుండడంతో పత్తి, పునాస పంటలు కుళ్లిపోతున్నాయి. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా విత్తనాలు విత్తుకున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 6లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అంచగా వేయగా.. అందులో సగం సాగు చేపట్టని పరిస్థితి నెలకొంది.
గడిచిన 24 గంటల్లో(మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) జిల్లావ్యాప్తంగా సరాసరి 54.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 78.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. ఖమ్మం అర్బన్ 71.6 మి.మీ, బోనకల్ 65.8 మి.మీ, పెనుబల్లి 61.4 మి.మీ, చింతకాని 60 మి.మీ, ముదిగొండ 60.6 మి.మీ, నేలకొండపల్లి 69 మి.మీ, కూసుమంచి 61.2 మి.మీ, ఖమ్మం రూరల్ 62.4 మి.మీ, రఘునాథపాలెం 50.2 మి.మీ, కల్లూరు 56.4 మి.మీ, సత్తుపల్లి 58.4 మి.మీ, మధిర 57.8 మి.మీ, ఎర్రుపాలెం 56.2 మి.మీ, తిరుమలాయపాలెం 43.4 మి.మీ, ఏన్కూరు మండలంలో 41.6 మి.మీ వర్షపాతం నమోదైంది. 6.12 సెంటీమీటర్ల వర్షపాతం నాలుగు మండలాల్లో, 3.6 సెంటీమీటర్ల వర్షపాతం 17 మండలాల్లో నమోదైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 144 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో చర్ల-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి-లింగాపురం మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం వెళ్లే మార్గమధ్యలో ఉన్న కుదునూరు రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 65 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మణుగూరులో 82 మి.మీ, పినపాక 68, దుమ్ముగూడెం 62, అశ్వాపురం 70, భద్రాచలం 65, దమ్మపేట 67, గుండాల 58, సుజాతనగర్ 53, కొత్తగూడెంలో 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కరకగూడెంలో 22 సెం.మీ నమోదైంది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. కిన్నెరసానిలో ఇప్పటికే 10గేట్లు ఎత్తివేయడంతో 41 వేల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేయడంతో 1.98 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అశ్వారావుపేట మండలం పెదవాగులో భారీగా వరద నీరు చేరడంతో 2,749 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. చుంచుపల్లి మండలం మూలుగుగూడెం వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు.
అత్యధికంగా చర్ల మండలంలో వర్షం కురవడంతో గతంలో పనిచేసిన కలెక్టర్ అనుదీప్ ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లి ఆయా మండల అధికారులను అప్రమత్తం చేశారు. రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల వారిని బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
జిల్లాలో మొత్తం 2,144 చెరువులు ఉండగా.. ఇందులో 500 చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో మత్తడి పోస్తున్నాయి. పాల్వంచ మండలం యానంబైలు చెరువు అలుగు వద్ద చిన్న మరమ్మతు రావడంతో ఇరిగేషన్ అధికారులు అప్పటికప్పుడు బాగు చేశారు.