ప్రతి బడిలో తాగునీటి వసతి, వంట గది.. టైల్స్తో మెరిసిపోతున్న టాయిలెట్లు.. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు.. వాల్ పేయింట్స్తో ప్రహరీలు కళకళలాడుతున్నాయి. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త వైభవం తీసుకొచ్చింది.. దీంతో పిల్లల ఆశలు నిజమయ్యాయి.. తల్లిదండ్రుల కలలు నెరవేరాయి.. బుధవారం జిల్లావ్యాప్తంగా 50కి పైగా బడులు పునః ప్రారంభమయ్యాయి.. ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, బోనకల్లులో ఎమ్మెల్యే భట్టివిక్రమార్క పాఠశాలలను ప్రారంభించారు.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 1
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగానే బుధవారం ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెంలో రూ.12.49లక్షలు, శాంతినగర్లో రూ.1.14కోట్లతో అభివృద్ధి చేసిన పాఠశాలలను మంత్రి పువ్వాడ అజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత, మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు పాఠశాలను రూ.27లక్షలు, పాకలగూడెం పాఠశాలను రూ.28.5లక్షలతో పాటు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో అన్ని సౌకర్యాలతో, అధునాతనంగా తీర్చిదిద్దిన పాఠశాలలను బుధవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ప్రారంభించారు.
ఇల్లెందు పట్టణం స్టేషన్బస్తీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను ‘మన ఊరు- మన బడి/మన బస్తీ-మన బడి’లో భాగంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దడంతో బుధవారం ఆ పాఠశాలలను భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను తెలుసుకున్నారు.
వైరా మండలం గొల్లెనపాడు గ్రామం పాఠశాలలో రూ.20లక్షలతో చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి కావడంతో బుధవారం ఎమ్మెల్యే రాములునాయక్ స్థానిక నాయకులతో కలిసి పాఠశాలను ప్రారంభించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి చాక్పీస్తో బోర్డుపై ‘మన ఊరు – మన బడి’ అని రాశారు.
‘మన ఊరు – మన బడి’లో భాగంగా ఎంపికైన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో పనులు పూర్తవ్వడంతో బుధవారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ప్రారంభించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని అన్నారు.