సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 17 : సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనాన్ని హెటిరో సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్మే మట్టా రాగమయితో కలిసి ప్రారంభించారు. సత్తుపల్లి బస్టాండ్ సమీపంలో రెవెన్యూ గెస్ట్హౌస్ స్థలంలో 17 కుంటల స్థలాన్ని కలెక్టర్ గ్రంథాలయం నిర్మాణం కోసం హెటిరో సంస్థకు అప్పగించారు. ఈ మేరకు సంస్థ చైర్మన్ పార్థసారధిరెడ్డి తన సొంత నిధులు రూ.2 కోట్లను ఖర్చుచేసి భవన నిర్మాణం పూర్తిచేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ భవనంలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రాగమయి సమక్షంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మంజువాణికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీ బండి మాట్లాడుతూ తాను చదువుకున్న సత్తుపల్లి పట్టణంలో గ్రంథాలయం నిర్మించాలని గత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు కోరిన మీదట తనకు సుందరమైన గ్రంథాలయ భవనం నిర్మించే అవకాశం కలిగిందన్నారు.
గ్రంథాలయానికి అన్ని హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజేషన్ చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన అనేకరకాల పుస్తకాలు ఏర్పాటు చేయడంతోపాటు డిజిటలైజేషన్ కూడా చేయించనున్నట్లు తెలిపారు. సత్తుపల్లి ప్రాంతం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి ప్రాంతానికి ఎంపీ బండి పార్థసారధిరెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఆయనకు జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకునేలా కందుకూరులో జూనియర్ కళాశాల నిర్మాణంతోపాటు కల్లూరు బస్టాండ్ నిర్మాణానికి కూడా ముందుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ వనమా వాసు, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, కంటే నాగమణి, బీఆర్ఎస్ నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మల్లూరు అంకమరాజు, షేక్ రఫీ, మాధురి మధు, వీరపనేని బాబి, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, కొత్తూరు ప్రభాకర్రావు, సాయిస్ఫూర్తి కళాశాల ఇన్చార్జి దాసరి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.