మధిర, అక్టోబర్ 7 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో దళితవాడలన్ని సందడిగా మారాయి. మండలంలోని 22 గ్రామాల్లో మండల, జిల్లాస్థాయి అధికారులు దళితవాడల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటున్నారు. ప్రతి కుటుంబం నుంచి దళితబంధు పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధితోపాటు, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రధానంగా 55 ఏళ్లుగా నాటి పాలనలో దళిత కుటుంబాలన్నీ వెనుకబాటుతనానికి గురయ్యాయి. అభివృద్ధి లేక, జీవనోపాధి కరువై, వలసలు పోయి బతుకుపోరాటం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు.
వారి జీవనభ్యున్నతి కోసం, ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నారు. ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గంలో తొలివిడతలో భాగంగా చింతకాని మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని 3,562 కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. నాడు సీఎం కేసీఆర్ బోనకల్లు మండలం మొక్కజొన్న పంటనష్ట పరిశీలనకు వచ్చినప్పుడు బోనకల్లు మండలానికి చెందిన దళిత మహిళలు ఆయన్ని స్వయంగా తమకు కూడా దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని వేడుకున్నారు.
అంతేకాక జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అభ్యర్థన మేరకు ఇటీవల సత్తుపల్లి సభలో మంత్రి కేటీఆర్ సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు, బోనకల్లు మండలాన్ని కూడా పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీంతో మండలవ్యాప్తంగా దళిత సంఘాలు, టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆయా గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ వీపీ గౌతమ్ బోనకల్లు మండలానికి జడ్పీ సీఈవో ఇంజం వెంకటప్పారావు పర్యవేక్షణలో ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. మండలాధికారులు 22 గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. జడ్పీ చైర్మన్ కమల్రాజు, మండల అధికారులు గ్రామాల వారీగా ఎస్సీల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటున్నారు.
మండలంలోని 22 గ్రామాల్లో 4,922 దళిత కుటుంబాలు ఉన్నట్లు సకలజనుల సర్వేలో తేలింది. వీటితోపాటు ప్రస్తుతం మరికొన్ని కుటుంబాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కుటుంబాల వివరాలు ఆళ్లపాడు- 106, బోనకల్లు- 450, బ్రాహ్మణపల్లి- 269, చిన్నబీరవల్లి- 199, చిరునోముల- 419, చొప్పకట్లపాలెం- 193, గార్లపాడు- 77, గోవిందాపురం ఎ- 89, జానకీపురం, సీతానగరం- 285, కలకోట- 427, గోవిందాపురం, లక్ష్మీపురం- 490, మోటమర్రి- 309, ముష్టికుంట్ల- 175, నారాయణపురం- 176, పెద్దబీరవల్లి- 133, రామాపురం- 75, రాపల్లె- 99, రావినూతల- 368, రాయన్నపేట- 194, తూటికుంట్ల- 389, గృహాల్లో 4,922 ఎస్సీ కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి.
మండలంలోని 22 గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ దళితబంధు దరఖాస్తులు తీసుకుంటూనే పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జడ్పీ చైర్మన్ కమల్రాజు ఆయా దళితవాడల్లో తిరుగుతూ పలు సమావేశాల్లో దళితులకు భరోసా కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజధానితోపాటు పలు ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన దళిత కుటుంబాల వారు కోటి ఆశలతో, సీఎం కేసీఆర్పై నమ్మకంతో తిరిగి స్వగ్రామాలకు వచ్చేస్తున్నారు. బ్యాంకు అకౌంట్ లేనివారు, కుల ధ్రువీకరణ పత్రం లేనివారందరూ వాటికోసం పరుగులు పెడుతున్నారు.
దళితుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. దళితవాడల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ‘దళితబంధు’ కోసం బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నారు. బోనకల్లు మండలంలోని దళితులందరికీ దళితబంధు పథకం మంజూరు చేయడం హర్షణీయం. 22 గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు అందించేందుకు అధికారులు కృషిచేయాలి. దళితుల అభ్యున్నతికి ఇంతలా పని చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరు.
– జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు