ఖమ్మం, ఆగస్టు 16 : పేదలను ఆదుకునే గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే నిరుపేదలందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్న మంచి మనసు ఆయనదని అన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స పొందిన పేదలకు ఆయన సిఫార్సు ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బుధవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 57 మంది లబ్ధిదారులకు రూ.34.88 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారం ద్వారా మంజూరైన ఈ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ తొమ్మిదేళ్లలో కేవలం సీఎంఆర్ఎఫ్ ద్వారానే రూ.3 వేల కోట్లను పేదల వైద్యానికి అందించారని గుర్తుచేశారు. అందుకే ఆయన మళ్లీ సీఎం అయితేనే ఇప్పుడున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. అలాకాకుండా అధికారం మరెవ్వరి చేతికి వెళ్లినా ఇలాంటి సంక్షేమ పథకాలు మరుగున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, నల్లమల్ల వెంకటేశ్వర్లు, చింతనిప్పు కృష్ణ చైతన్య, మండే వీర హనుమంతురావు, వీరూనాయక్, తోట రామారావు, చావా వేణు, చామకూరి రాజు, లక్ష్మిరెడ్డి, ముత్యాల వెంకట అప్పారావు, రవి, మీగడ శ్రీనివాస్, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, కోడిరెక ఉమాశంకర్, నెమలి కొండ వంశీ, చెరుకుమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.