రఘునాథపాలె/ఖమ్మం సిటీ, మే 22: జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం రాష్ట్ర క్యాబినెట్ 23 ఎకరాలకు ఆమోదం తెలిపినందుకు గాను ఖమ్మం నగరంలోని డీపీఆర్సీ భవనంలో సోమవారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. తొలుత మంత్రికి టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో సంఘం నాయకులు క్రేన్ సాయంతో గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ.. ఖమ్మం పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని సంఘం జిల్లా మహాసభలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు. 23 ఎకరాల స్థలం సాధించడంలో సంకల్పం మాత్ర మే తనదని, సహకారం అందించింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇండ్ల స్థలాల కేటాయింపు ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తనకు సహకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మంత్రి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ నుంచి పట్టాలు తీసుకొస్తానన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించి ప్రత్యేక కోటా కింద జర్నలిస్టులకు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామన్నారు. టీజేఎఫ్ది, బీఆర్ఎస్ది పేగుబంధమన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా వచ్చే నెల మొదటి వారంలో జర్నలిస్టులకు ఇండ్ల పట్టా లు అందజేస్తామన్నారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి..’ అనే సామెతను తాను బలంగా నమ్ముతానన్నారు. ఖమ్మంలో నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన జర్నలిస్టులందరికీ పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఘనంగా సన్మానించిన టీజేఎఫ్కు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టులు ఇంత పెద్దఎత్తున ఓ రాజకీయ నాయకుడికి సన్మానం చేయడం తానెప్పుడూ చూడలేదన్నారు. తాను ఏ లబ్ధి ఆశించలేదన్నారు. జర్నలిస్టుల గుండెల్లో తన స్థానం పదిలంగా ఉంటే చాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ పునకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, నాయకులు సాంబశివారావు, బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్రెడ్డి, రామకృష్ణ, రజనీకాంత్, రాఘవ, గుద్దేటి రమేశ్, విజేత, భాస్కర్, రామారావు పాల్గొన్నారు.