మున్సిపాలిటీలు సకాలంలో పన్ను వసూళ్లను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్’ మున్సిపాలిటీల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు పన్ను చెల్లించిన ఇంటి యజమానులు 5 శాతం రాయితీ పొంది మరుసటి ఏడాది ఇంటి పన్ను ముందే చెల్లించారు. ఖమ్మం నగరపాలకసంస్థ పన్ను వసూళ్లలో టాప్గా నిలుస్తున్నది. ఇదే స్కీం ద్వారా గతేడాది కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. ఆ తర్వాతి స్థానాల్లో మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీలు నిలిచాయి. భద్రాద్రి జిల్లాలో పాల్వంచ మున్సిపాలిటీ రూ.79 లక్షల పన్ను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలు నిలిచాయి.
– ఖమ్మం, మే 1ఖమ్మం, మే 1: ఇంటి పన్నులు ముందస్తుగానే చెల్లిస్తే పన్నులో 5శాతం రాయితీ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్’ స్కీం సత్ఫలితాలనిచ్చింది. ఖమ్మం నగరంతోపాటు వైరా, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లో రికార్డ్ స్థాయిలో పన్నులు వసూలయ్యాయి. అత్యధికంగా ఖమ్మం నగరంలో ఒక్క ఏప్రిల్ మాసంలోనే రూ.8.40 కోట్ల పన్ను వసూలైంది. మధిర మున్సిపాలిటీ పరిధిలో రూ.55 లక్షలు, సత్తుపల్లి రూ.1.10 కోట్లు, వైరా రూ.37 లక్షలు, కొత్తగూడెం రూ.78 లక్షలు, పాల్వంచ రూ.79 లక్షలు, మణుగూరు రూ.35 లక్షలు, ఇల్లెందు రూ.30 లక్షలు వసూలయ్యాయి. ఒక్క ఖమ్మం జిల్లాలోనే రూ.12.64 కోట్లు వసూలు కావడం విశేషం.
స్కీం అమలు ఇలా..
ఇంటి యజమానులు ఏడాదిలో రెండుసార్లు ఇంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మున్సిపాలిటీలు వాటికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటాయి. మార్చిలో ఇంటి పన్నులు చెల్లించిన వారు తదుపరి సంవత్సర ఇంటిపన్నును ముందస్తుగానే చెల్లిస్తే పన్నులో 5శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో స్కీం అమలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్లోనే అమలు చేయడంతో ఇంటి యజమానులు ముందుగానే పన్నులు చెల్లించారు. 5శాతం రాయితీ పొందారు.
ఖమ్మం నగరం టాప్..
నగర పరిధిలో 76 వేల గృహాలు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31 కోట్ల ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉన్నది. మార్చి 31 నాటికి రూ.27 కోట్లు వసూలైంది. మార్చి 31వ తేదీకి ముందు 49,006 మంది పన్ను చెల్లించగా వీరిలో 12,132 మంది ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ముందస్తుగా ఇంటిపన్ను చెల్లించారు. తద్వారా ఒక్క ఏప్రిల్లోనే నగరపాలక సంస్థ రూ.8.40 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. ఇది గతేడాది కంటే రూ.1.55 కోట్లు ఎక్కువ.. గతేడాదీ ఇదే స్కీం అమలైంది.
స్కీం విజయవంతం..
ఎర్లీబర్డ్ స్కీం సత్ఫలితాలనిచ్చింది. ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఇదే స్థాయిలో బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది కష్టపడ్డారు. ఇళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతోనే లక్ష్యాలను చేరుకుంటున్నాం. గతేడాది స్కీం ద్వారా రూ.6.85 కోట్ల పన్ను వసూలు చేయగా ఈ సారి నగర పరిధిలో ఒక్క నెలలోనే రూ.8.40 కోట్లు వసూలు చేశాం.
– ఆదర్శ్ సురభి, నగరపాలకపాలక సంస్థ కమిషనర్, ఖమ్మం