భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తుపాన్ ప్రభావం జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా జిల్లా అంతటా వానలు దంచి కొడుతున్నాయి. కొన్నిచోట్ల మోస్తరు, మరికొన్నిచోట్ల భారీ వానలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడెంలో ముర్రేడు, గోధుమ వాగుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట, దుమ్ముగూడెం, ముకలపల్లి మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దీని నీటి మట్టం ప్రస్తుతం 405 అడుగులు ఉంది. ఇప్పటికే 17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. చర్ల మండలం తాలిపేరుకు భారీగా వరద నీరు చేరడంతో 16 గేట్లు ఎత్తి 1,03,543 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీరు చేరింది.
అల్పపీడన ద్రోణి బలబడింది. మూడు రోజులుగా మోస్తరు వాన కురింది. శనివారం అతి భారీ వర్షం కురిసింది. ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలతోపాటు అన్ని గ్రామాల్లో ఇడవకుండా వాన పడింది. చెరువులు,కుంటలు నిండాయి. మణుగూరు, పినపాక, గుండాల, కరకగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతోపాటు పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, రుంద్రంపూర్, జూలూరుపాడు, ఇల్లందు, భద్రాచలం, మణుగూరు మండలాల్లో మోస్తరు వాన కురిసింది. ఇల్ల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో వర్షపాతం ఇలా..
జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. పినపాకలో 76, దుమ్ముగూడెంలో 60, అశ్వాపురంలో 58, చర్లలో 33, మణుగూరులో 42, గుండాలలో 40, జూలూరుపాడులో 21, కొత్తగూడెంలో 17, బూర్గంపాడులో 26, భద్రాచలంలో 27, ములకలపల్లిలో 26, దమ్మపేటలో 20 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులపాటు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన పత్తి పంట మొదళ్లు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే వేసిన మిర్చి నారు నీట మునిగిందని చెబుతున్నారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
భద్రాచలం, సెప్టెంబర్ 11: భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతున్నది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా సాగుతున్నది. ఆదివారం ఉదయం 8.00 గంటలకు 31.5 అడుగులున్న గోదావరి.. కొద్దికొద్దిగా పెరుగుతూ సాయంత్రం 6.00 గంటలకు 36.1 అడుగులకు చేరుకుంది. సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరికను చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతుండటంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.
తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
చర్ల, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో మండలంలోని తాలిపేరు, కొండవాగులు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం అడవుల నుంచి కొండ వాగుల ద్వారా భారీగా వరద నీరు చేరుతున్నది. రిజర్వాయర్లోకి సామర్థ్యానికి మించి వరద నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం 15 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 1, 33,356 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలారు.
మునిగిన నారచీరెల ప్రాంతం
పర్ణశాల, సెప్టెంబర్ 11: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పర్ణశాలలోని సీత వాగు పొంగిపొర్లుతున్నది. నార చీరెల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. మండలంలోని చెరువులు, వాగులు పూర్తిగా నిండాయి. పర్ణశాల వద్ద గోదావరికి వరద స్వల్పంగా పెరిగింది. ముం పు గ్రామాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కిన్నెరసాని నుంచి 17వేల క్యూసెక్కుల విడుదల
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 11: కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం 17వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గత రాత్రి కిన్నెరసాని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. నీటి మట్టం 407 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 28వేల క్యూసెక్కులు ఉండటంతో మూడు గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని డ్యాం సైట్ అధికారులు దిగువకు విడుదల చేశారు. పరీవాహక ప్రాంతాలా ప్రాజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా సోమవారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరవచ్చని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. క్షేత్రస్థాయి అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అత్యవసర సేవలకు కలెక్టరేట్లో, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు 08744-241950, 08743-232444కు కాల్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపత్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. తెగిపోయిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు ప్రజలు వెళ్లొద్దని కోరారు.