సత్తుపల్లి, సెప్టెంబరు 17 : 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేశాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అప్పటి నుంచి తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు విషం చిమ్ముతున్నాయన్నారు.
55 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని భ్రష్టు పట్టించగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విభజన హామీ చట్టాలను తుంగలో తొక్కి రాష్ర్టానికి కేటాయించిన నిధులను కేటాయించకుండా రాష్ర్టాన్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకుంటూ ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా తెలంగాణ అవతరించిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మచైర్మన్ వనమా వాసు, నాయకులు మల్లూరు అంకమరాజు, కనగాల వెంకట్రావు, దొడ్డా శంకర్రావు, మాధురి మధు, మోరంపూడి ప్రభాకర్, షేక్ రఫీ, చల్లా రవీందర్రెడ్డి, అద్దంకి అనిల్, చాంద్పాషాలతో పాటు నాయకులు పాల్గొన్నారు.