భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇళ్లులేని పేదలకు వారం రోజుల్లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కొత్తగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతంలో 22 ఎకరాల స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. ఇళ్లు లేని వారిని గుర్తించి వారంలో వారికి కేటాయిస్తామన్నారు.
దీంతోపాటు సింగరేణి ఓసీ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 300 మందికి మేగ్జిన్ వద్ద ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇవన్నీ చకచకా జరిగిపోతాయన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో చింతల చెరువును మినీ ట్యాంక్బండ్గా తయారు చేస్తున్నామని అన్నారు. ఇందుకు రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. ట్యాంక్బండ్ పైభాగంలో సెంట్రల్ లైటింగ్తోపాటు బోటు షికారు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలకు రోడ్లు, సీసీ డ్రెయిన్లకు రూ.76 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
త్వరలో ఆ పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. అలాగే, చెక్డ్యాంల నిర్మాణం కోసం రూ.35 కోట్లు, ముర్రేడు వాగు రిటైనింగ్ వాల్కు మరో రూ.33 కోట్లు మంజూరైనట్లు వివరించారు. బంగారుజాల గ్రామంలో వంతెన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి గృహలక్ష్మి పథకం ద్వారా త్వరలోనే రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించామన్నారు. జర్నలిస్టులకు కూడా త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తానన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు శాంతి, సోనా, అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.