మణుగూరు టౌన్/ అశ్వాపురం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, ఏప్రిల్ 30: భద్రాద్రి జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉక్కపోత, వేసవితాపం నుంచి ఈ వర్షం కారణంగా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
అయితే, మణుగూరులో సుమారు గంటసేపు భారీ వర్షంతోపాటు వడగండ్లు కూడా కురిశాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో వాహనదారులు, పాదచారులు, చిరువ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు. అశ్వాపురం మండలం గోపాలపురం వద్ద ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో స్థానికులు, వాహనదారులు కలిసి కూలిన చెట్టును తొలగించారు. దీంతో సాయంత్రానికి ట్రాఫిక్ క్లియర్ అయింది.
మరోపక్క అన్నదాతలు పంట తడిచిపోకుండా ముందుగానే కల్లాల్లో పరదాలు కప్పి పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. దుమ్ముగూడెంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కొరతతో ఇప్పటికే ఓ పక్క వరికోతలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ వర్షంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.