ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు- మన బడి’తో పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుతున్నాయి. అధికారులు మొదటి విడతకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 794 స్కూళ్లు ఎంపిక చేసి 12 రకాల పనులను గుర్తించారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, దురిశెట్టి అనుదీప్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. 100శాతం పనులు పూర్తి చేసుకున్న 57 పాఠశాలలు వచ్చే నెల 1న ప్రారంభంకానున్నాయి.
ఖమ్మం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు సర్కారు బడి అనగానే పాత భవనాలు, చెట్ల కింద చదువులు గుర్తొచ్చేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మన ఊరు- మన బడి/మన ఊరు-మన బస్తీ’తో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు 12 రకాల అవసరాలను గుర్తించి పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. కొత్తగా అదనపు గదులు, మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్లు, ప్రహరీలు నిర్మిస్తున్నారు. మొదటి విడతకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపికైన పాఠశాలల్లో ఇప్పుడు అన్ని వసతులు సమకూరుతున్నాయి. ఇప్పటికే 57 ప్రభుత్వ పాఠశాలల్లో 100శాతం పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న ఆయా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
అది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల ప్రాథమిక పాఠశాల.. అరకొరగా విద్యార్థుల సంఖ్య.. శిథిలమైన పాత భవనం.. తలుపులు లేని కిటికీలు.. మరుగుదొడ్డిలో పిచ్చి మొక్కలు పాఠశాలలో కనిపించే దృశ్యాలు.. అయితే అది ఒకప్పుడు.. సీఎం కేసీఆర్ విజన్తో అమలవుతున్న ‘మన ఊరు- మన బడి’తో పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ బడికి వాటర్ ట్యాంక్, మరుగుదొడ్లు, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, ఫర్నిచర్ సమకూరాయి. శిథిలావస్థలో ఉండే పాఠశాల ఇప్పుడు ‘కార్పొరేట్’ స్థాయికి చేరుకున్నది.
ప్రతి స్కూల్లో వసతుల కల్పన..
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీలు నిర్మిస్తున్నది. తాగునీటి వసతి కల్పిస్తున్నది. నామినేషన్ పద్ధతిలో పనులు చేపడుతున్నది. ‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు, విద్యుదీకరణ డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్క్లాస్ పరికరాలు, గ్రీన్ చాక్పిస్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, ఫర్నిచర్ అందుబాటులోకి వచ్చాయి. పాఠశాలల్లో గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చి మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు సమకూరుతుండడంతో పిల్లల తల్లిదండ్రులకు పాఠశాలలపై నమ్మకం పెరుగుతున్నది. వచ్చే విద్యాసంవత్సరంలో 1-8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమలు కానుండడంతో మరింత భరోసా వచ్చింది.
ఖమ్మం జిల్లాలో 32 స్కూల్స్..
ఖమ్మం జిల్లావ్యాప్తంగా తొలివిడత ‘మన ఊరు- మనబడి/ మన ఊరు- మనబస్తీ’కి 426 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. కలెక్టర్ వీపీ గౌతమ్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి వేగంగా పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 32 పాఠశాలల్లో 100శాతం పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర సర్కార్ పనులకు రూ.9.87 కోట్ల నిధులు వెచ్చించి 12 రకాల పనులు చేయించింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆయా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తి చేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మిగిలిన జిల్లాలు ఉన్నాయి. అధికారులు పనులకు సంబంధించిన అంచనాలను వేగంగా రూపొందించి చకచకా పనులు పూర్తి చేశారు.
సిద్ధమైన స్కూల్స్ ఇవే..
చింతకాని మండలంలోని వందనం ప్రభుత్వ పాఠశాల, ప్రొద్దుటూరు, ఏన్కూరు మండలంలోని ఆన్కూరు, గార్లపాడు, కల్లూరు మండల కేంద్రంతోపాటు ముచ్చవరం, నారాయణపురం, ఖమ్మం అర్బన్ మండలంలోని శాంతినగర్, మామిళ్లగూడెం, కొణిజర్ల మండల కేంద్రంతోపాటు తనికెళ్ల, కూసుమంచి మండలంలోని జక్కేపల్లి, మధిర పట్టణంతోపాటు వంగవీడు, రాయపట్నం, నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెం, పెనుబల్లి మండలంలోని చింతగూడెం, రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల, గణేశ్వరం, సత్తుపల్లి మండలంలోని రేగుళ్లపాడు, బుగ్గపాడు, పాకాలగూడెం, తల్లాడ మండలంలోని కొడవటిమెట్ట, వైరా మండలంలోని గొల్లనపాడు, రెబ్బవరం, ఎర్రుపాలెం మండలంలోని రాజుల దేవరప్పాడు, వేంసూరు మండలంలోని భారగనిపాడు, కేజీ మల్లెల, బోనకల్ మండలంలో ఆళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.
భద్రాద్రి జిల్లాలో వచ్చే నెల 1న 25 స్కూళ్లు ప్రారంభం..
భద్రాద్రి జిల్లాలో తొలి విడత ‘మన ఊరు- మన బడి’కి 368 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో అధికారులు 204 పాఠశాలల్లో 12 రకాల సమస్యలను గుర్తించారు. తొలి విడతలో రూ.2 కోట్ల నిధులతో మరమ్మతులు చేపట్టారు. ‘మన ఊరు- మన బడి’కి సర్కార్ మొత్తం రూ.60 కోట్ల నిధులు వెచ్చించింది. ఇప్పటికే 80 శాతం పాఠశాలల్లో ప్రహరీలు, టాయిలెట్స్, వంట గదుల నిర్మాణాలు పూర్తయ్యాయి. వందకు వందశాతం పనులు 75 పాఠశాలలు, 80 శాతం పనులు 80 పాఠశాలలు, 60 శాతం పనులు 200 పాఠశాలల్లో పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అన్ని పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తి కానున్నాయి. కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా ప్రతి పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. ఫిబ్రవరి 1న వందశాతం పనులు పూర్తయిన 25 పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
సిద్ధమైన పాఠశాలలు ఇవే..
ఆళ్లపల్లి మండలంలోని సంధి బంధం ప్రభుత్వ పాఠశాల, రాఘవాపురం, అన్నపురెడ్డిపల్లి మండలంలోని అన్నదేవం, అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం, ఊట్లపల్లి, చండ్రుగొండలోని దామరచర్ల, చర్ల మండలంలోని కలివేరు, లక్ష్మీకాలనీ, దమ్మపేట మండలంలోని జగ్గారం, పాకలగూడెం, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల, సీతానగరం, కరకగూడెం మండలంలోని బట్టుపల్లి, ప్రాథమిక, హైస్కూల్, కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని పీఎస్ హనుమాన్ బస్తీ, పీఎస్ మేదర బస్తీ, లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇందిరానగర్ కాలనీ, మణుగూరు మండలంలోని చెరువు సింగారం, సమితి సింగారం, ములకలపల్లిలోని పొగళ్లపల్లి, పాల్వంచ పట్టణంలోని ప్రశాంతినగర్, పినపాక మండలంలోని గార్లబయ్యారం, సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి తండా, ఇల్లెందు పట్టణంలోని స్టేషన్ బస్తీ, స్టేషన్ బస్తీ (ఉర్దూ) ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30 (నమస్తేతెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాడు అధ్వానంగా ఉండేది. కూలుతున్న ప్రహరీ, పెచ్చులూడుతున్న తరగతి గదులు, పనిచేయని చేతిపంపు, తలుపులు లేని మరుగుదొడ్లు ఉండేవి.. విద్యార్థులకు సరైన వసతులు లేక ఇబ్బంది పడేవారు. తల్లిదండ్రులు ఈ పాఠశాలకు తమ పిల్లలను పంపించేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ ‘మన ఊరు- మన బడి’లో భాగంగా ఈ పాఠశాల ఎంపికై అన్ని వసతులూ సమకూర్చుకున్నది. విద్యార్థులకు ఇప్పుడు తాగునీటి వసతి వచ్చింది. వంటగది, ప్రహరీ, కొత్త తరగతి గదులతో ఇప్పుడా పాఠశాల కళకళలాడుతున్నది. గతంలో అరకొరగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 82కు చేరింది. ఫిబ్రవరి 5న రెండో విడత పాఠశాలల ప్రారంభోత్సవంలో ఈ పాఠశాల ప్రారంభం కానున్నది.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. మా పిల్లలను మేం టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాము. పాఠశాలలో పిల్లలకు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, తరగతి గదులు అన్నీ అందుబాటులోకి వచ్చినయి. తెలంగాణ వచ్చినాకే సర్కారు బడులు బాగుపడ్డాయి. పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నారంటే ఎంతో ఆనందాన్నిస్తున్నది.
– మానస, విద్యార్థి తల్లి, కొత్తగూడెం
ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు..
‘మన ఊరు- మన బడి’లో భాగంగా టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు సమకూరాయి. సర్కారు బడులంటే సౌకర్యాలు ఉండవని గతంలో అనుకునేవారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు- మన బడి’తో ఇప్పుడు సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు సమకూరాయి. తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిస్తున్నారు.
– బానోత్ లక్ష్మా, ప్రధానోపాధ్యాయుడు, టేకులపల్లి మండలం
ప్రైవేటు స్కూళ్లకు ఆదరణ తగ్గింది..
ఒకప్పుడు ప్రైవేటు స్కూ ళ్లకు ఆదరణ ఉండేది. తల్లిదండ్రులు అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపేవారు. ‘మన ఊరు -మన బడి’తో సర్కార్ బడుల్లో అన్ని వసతులు వస్తున్నాయి. తెలంగాణ వచ్చాకే ఈ మార్పు జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. మా కుమారుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు.
– ధరావత్ శంకర్రావు, ఎ-కాలనీ తండా, టేకులపల్లి మండలం
సర్కార్ బడులు ప్రైవేటు స్కూల్స్కంటే బాగున్నాయి
‘మన ఊరు- మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ప్రైవేటు బడుల కంటే ఇప్పుడు సర్కార్ బడులే బాగుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బడిలో పిల్లలకు అన్ని వసతులూ కల్పిస్తున్నది. మా పిల్లలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.
– భూక్యా సురేశ్, టేకులపల్లి