అధికారులు, కాంట్రాక్టర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్
మామిళ్లగూడెం, జూలై 6: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల గడప వరకు బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, స్టేజ్-2 కాంట్రాక్టర్లతో బుధవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ, సివిల్ సప్లయి శాఖల సమన్వయంతో ప్రతి అంగన్వాడీ కేంద్రానికీ ప్రతి నెలా డోర్ స్టెప్ వరకు బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు.
ఇందుకు సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణా చార్జీల విషయమై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ వారీగా సూపర్విజన్ మ్యాపింగ్ పూర్తయిందని, అంగన్వాడీ కేంద్రాలకు ఫుడ్ గ్యాప్ రాకుండా వెంటనే బియ్యం సరఫరా చేయాలని అన్నారు. రూట్ ఆఫీసర్లుగా సూపర్వైజర్స్ వ్యవహరిస్తారన్నారు. డీడబ్ల్యూవో సంధ్యారాణి, డీఎస్వో రాజేందర్, మేనేజర్ సోములు, ఐసీడీఎస్ సీడీపీవోలు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జిలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.