కరకగూడెం, ఏప్రిల్ 21: గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రేగళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన 120 మంది ఎస్టీలకు అసైన్డ్ పట్టాలను పంపిణీ చేసి మాట్లాడారు. అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతుల సమస్యలను గతంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని రైతులకు అసైన్డ్ పత్రాలు అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నియోజవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారన్నారు. నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తామన్నారు.
త్వరలోనే పులుసుబొంత ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తామన్నారు. వాగులపై అవసరైమన చోట వంతెనలు, చెక్డ్యాంలు నిర్మిస్తామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు అసైన్డ్, పోడు పట్టాలు అందుతాయని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. ప్రజలు పనులు చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, కేవలం మాటలు చెప్పేవారిని నమ్మొద్దన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. గిరిజన రైతుల సంక్షేమమే రాష్ట్ర సర్కార్ ధ్యేయమన్నారు దశాబ్దాల నుంచి ఏజెన్సీలో భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పిస్తామన్నారు. అర్హులందరికీ పట్టాలు మంజూరు చేస్తామన్నారు.
ప్రస్తుతం 400 ఎకరాలు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇచ్చామన్నారు. వచ్చే సీజన్ నుంచి వీరందరికీ రైతుబంధు అందుతుందన్నారు. వారికి రైతుబీమా కూడా వర్తిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పోడు భూముల సర్వే కూడా పూర్తయిందని, సీఎం కేసీఆర్ త్వరలో పోడు పట్టాలు మంజూరు చేస్తారన్నారు. సీఎం విడుదల చేసిన నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మిస్తామన్నారు. అర్హులందరికీ గిరివికాస్ పథకం వర్తింపజేస్తామన్నారు. పులుసుబొంత ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి రైతుకు పోడు హక్కు పత్రాలు అందుతాయని, ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంజా వసంతరావు, తహసీల్దార్ ఉషాశారద, ఎంపీడీవో శ్రీను, ఎంఈవో వీరస్వామి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మేము దశాబ్దాల నుంచి భూములు సాగు చేసుకుంటున్నాం. మా సమస్యను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా బాధలను గుర్తించి మాకు భూమిపై హక్కులు కల్పించారు. అధికారులతో పకడ్బందీగా సర్వే చేయించారు. హక్కు పత్రం అందివ్వడం ఆనందాన్నిచ్చింది. రైతుబంధు, రైతుబీమా పథకాలు మాకూ వర్తిస్తాయని మేమెప్పుడూ అనుకోలేదు. పట్టాలు అందించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-వజ్జ వెంకటలక్ష్మి, మహిళా రైతు, రేగళ్ల