కరకగూడెం, మే 5: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కరకగూడెం పంచాయతీ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ ఉషాశారద ఆధ్వర్యంలో చేపట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ ఆడపిల్లల వివాహాలు జరిపించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. మన పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. తప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వమైతే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. అయినా సీఎం కేసీఆర్ పేదల కులుంబాల్లో వెలుగులు నింపేందుకు పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ రేగా కాళిక, సర్పంచ్ ఊకే రామనాథం, ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, గిర్దావర్లు హుస్సేన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
విప్ రేగాను కలిసిన ఎంపీడీవో శంకర్
నూతన ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన బర్మావత్ శంకర్ శుక్రవారం ప్రభుత్వ విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి మండల అభివృద్ధిపై చర్చించారు. కరకగూడెం మండలంలోని వట్టంవారిగుంపు గ్రామంలో చందా భిక్షపతి నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువులు, పురుగుమందుల షాపును రేగా కాంతారావు ప్రారంభించారు.