ఖమ్మం, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహాయక చర్యలపై దృష్టి సారించారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరీవాహకంలో ఉన్న పలు గ్రామాల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మూడు రోజులుగా వరద ఉధృతి కొనసాగడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ అధికారులు ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. భద్రాచలం ఛత్తీస్గఢ్, ఒడిశాకు వెళ్లే జాతీయ రహదారిపై నెల్లిపాక వద్ద రాకపోకలు స్తంభించాయి. సారపాక – బూర్గంపహాడ్, సారపాక అశ్వాపురం మధ్య రహదారిపై వరద చేరింది. దీంతో ఆయా మార్గాల్లోనూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాచలం – చర్ల మార్గంలో దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రాకపోకలు స్తంభించాయి. బుధవారం ఉధృతంగా ప్రవహించిన గోదావరి.. గురువారం కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. గురువారం ఉదయం 6 గంటలకు 51.50 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటలకు 51.60, 9 గంటలకు 51.90, ఉదయం 10 గంటలకు 52 అడుగులకు చేరుకున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడే నిలకడగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరో 20 ఇంచులు పెరిగింది. సాయంత్రం 3 గంటల వరకు 52.20, రాత్రి 7 గంటలకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఎగువ నుంచి సుమారు 13,92,313 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం రాత్రికి 53 అడుగులకు చేరుకుంటే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వరద పరిస్థితిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరా తీశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్తో ఫోన్లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
గోదావరి ప్రవాహం గురువారం రాత్రికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరికను దాటే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో కలెక్టర్ అనుదీప్ అధికారులను అప్రమత్తం చేశారు. అశోక్నగర్ కొత్తకాలనీ, రామాలయ పరిసర ప్రాంతాల్లోకి కరకట్ట స్లూయిజ్ల నుంచి వరద నీరు చేరింది. మోటార్ల ద్వారా ఆ నీటిని తోడి గోదావరిలోకి పంపుతున్నారు. కాగా, అధికారులు భద్రాచలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.