అశ్వారావుపేట, ఏప్రిల్ 2 : కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పాఠశాలకు ఐదేళ్లపాటు ఏటా రూ.75 వేలు, ఒక్కో విద్యార్థికి యూనిఫాం కుట్టేందుకు రూ.100, విద్యార్థినులకు ప్రత్యేకంగా రాణి రుద్రమ ఆత్మ రక్షక్ ప్రశిక్షణ్కు రూ.15 వేల చొప్పున నిధులు మంజారు చేస్తుంది. ఈ నిధులతో మండల విద్యాశాఖ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించనున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఎంపిక చేయగా.. రెండు రోజుల క్రితం నిధులు విడుదల చేసింది. పాఠశాల ఆధునీకరణకు ‘ఎంపీ శ్రీ’ నిధులు దోహదపడతాయని హెచ్ఎం చంద్రశేఖర్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ఈ పథకం కింద రూ.27 లక్షలు మంజూరుకాగా.. పాఠశాలకు అవసరమైన అభివృద్ధి పనులను అధికారులు పూర్తి చేశారు. పాఠశాలలో రెండస్థుల భవనం, రెండు తరగతి గదులు, ఆఫీస్ గది, 10 నల్లాలతో తాగునీరు, పోలింగ్ బూత్ గదికి శాశ్వత మరమ్మతులు, వంట గది, బాలికలకు టాయిలెట్స్, గ్రీన్ బోర్డులు, ప్రతి తరగతి గదికీ 4 ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఫ్లోరింగ్, స్థూపం వంటి అభివృద్ధి పనులను పాఠశాల విద్యా కమిటీ పూర్తి చేసింది. దీంతో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం శ్రీ’ పథకం కింద మంజూరైన నిధులు మరింత అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటాయని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.