చింతకాని :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా పల్లెల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని ఆర్డబ్లూఎస్ ఈఈ పుష్పలత శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, చింతకాని, పాతర్లపాడు తదితర గ్రామాల్లో మిషన్భగీరథ తాగునీరు, మినరల్ వాటర్ ప్లాంట్లోని తాగునీటి మధ్య వ్యత్యాసాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించి ప్రజలకు వివరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నూరుశాతం పరీక్షలనంతరం గ్రామాలకు అధికారులు తాగునీరు అందిస్తున్నారని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు స్వచ్చమైనవని, ప్రతి ఇంటికి స్వచ్చమైన నీటిని అందించడమే ప్రభుత్వ అధికారులుగా తమ భాధ్యత అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భగీరథ పనుల్లో నాణ్యత, నీటి స్వచ్చత విషయంలో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు.
మిషన్ భగీరథ తాగునీటిపై గ్రామాల్లో వస్తున్న వదంతులు సరికావని, నూరు శాతం పరీక్షల అనంతరం గ్రామాలకు శుద్ద జలాలను పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ నరసింహరావు, ఎంపీడీవో రవికుమార్, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, జేఈలు గుగులోత్ భాస్కర్, సర్పంచులు గురజాల ఝాన్సీ, బండి సుభద్ర, కాండ్ర పిచ్చయ్య, కార్యదర్శులు షేక్ సైదులు, కే శ్రీరాంకుమార్, ముని, టెక్నీషియన్లు పాల్గోన్నారు.