కారేపల్లి, జూన్ 03 : విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను తాకట్టు పెట్టి అప్ప్పుతీసుకోవడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. కారేపల్లి మండలం ఎర్రబోడులో రైతు సంఘం సమావేశం మండల అధ్యక్షుడు ముండ్ల ఏకాంబరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును తీసుకురావడానికి చేసిన ప్రయతాన్ని దేశ వ్యాప్తంగా రైతాంగం గట్టిగా ప్రతిఘటించి తిప్పికొట్టిందన్నారు. ఆ బిల్లును సవరణ పేరుతో తిరిగి రాష్ట్రాలపై రుద్ది పక్రియను మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దానికి ప్రతిఫలంగా రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం సముఖంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడలను రాష్ట్ర ప్రభుత్వం తలోగ్గి నడుచుకుంటుందన్నారు. రాష్ట్రంలో నార్త్రన్, సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్ధలు ఉండగా రైతుల కోసమంటూ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో కొత్తగా మరో డిస్ట్రిబ్యూషన్ సంస్ధలను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతుందన్నారు.
రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసమే రైతు పవర్ పంపిణి సంస్ధ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రం చెప్ప్పుతున్నా దానిలో యదార్ధం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నార్త్రన్, సౌత్రన్ కంపెనీల నుండి రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో రైతుల విద్యుత్ కనెక్షన్లను వేరుచేయటం ద్వారా నార్త్రన్, సౌత్రన్ కంపెనీలకు లాభాలు చూపి వాటిని తాకట్టుపెట్టి అప్ప్పుతీసుకోవటానికి రాష్ట్రం ఎత్తుగడలేస్తుందన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు రంగం సిద్దమైందన్నారు. రాష్ట్రానికి ప్రతి స్మార్ట్ మీటర్ ఏర్పాటుకు కేంద్రం రూ.1400 ఇవ్వనుందన్నారు. స్మార్ట్మీటర్లు ఇండ్లతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద కూడా ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ప్రైవేటీకరణలో భాగంలోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రయత్నిస్తుందన్నారు.
రైతులు పండించిన మొక్కజొన్న అమ్మకానికి అష్టకష్టాలు పడ్డారన్నారు. బస్తాలు, లారీలు, గోడౌన్ల కొరత, అకాల వర్షాలతో రైతులు నానాయాతన పడి ప్రభుత్వానికి మొక్కజొన్న అమ్మినారని వాటి పైకాన్ని వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైందని పెట్టుబడులకు రైతులు ఇబ్బంది పడకుండా పంట డబ్బులు జమతో పాటు రైతు భరోసా విడుదల చేయాలన్నారు. రైతు సమస్యలపై జరిపే పోరాటాలకు రైతులు కదిలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు తుమ్మోజు రామ్మూర్తి, పాపినేని నాగేశ్వరరావు, భాగం వెంకటప్పారావు, ఎస్కే.సైదులు, తమ్మినేని ముత్తయ్య, వల్లభినేని మురళి, పాసిన్ని నాగేశ్వరరావు, అన్నారపు కృష్ణ పాల్గొన్నారు.