ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్ల్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, మూడోసారీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, బూర్గంపహాడ్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రభుత్వ విప్ రేగాతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బ్యాటరీకి చార్జింగ్ లేదని, అది ఎప్పుడో తుప్పుపట్టిపోయిందని ఎద్దేవా చేశారు. దండాలు పెట్టుకుంటూ, తల నిమురుకుంటూ పోతే అభివృద్ధి జరగదని అన్నారు. నిత్యం అభివృద్ధి చేసేందుకు నిధుల వేట కోసం తిరిగే రేగా మీకు ఉండడం అదృష్టమన్నారు. పార్టీ క్యాడర్ను సమర్థంగా వినియోగించుకొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని స్థానాలనూ గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
-మణుగూరు టౌన్, సెప్టెంబర్ 9
మణుగూరు టౌన్, సెప్టెంబర్ 9: వచ్చే ఎన్నికల్లోనూ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాల్లోనూ గెలవడం తథ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ను సమర్థంగా వినియోగించుకొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని స్థానాలనూ గెలిపించి అధినేత కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మణుగూరులోని కిన్నెర కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే రేగా కూడా తన సమయమంతా నియోజకవర్గ అభివృద్ధికే కేటాయిస్తారని, సెక్రటేరియట్లో నిత్యం పనుల కోసం తిరుగుతూ ఉంటారని, అభివృద్ధి నిధుల వేట కోసం నిత్యం తిరిగే రేగా వంటి ఎమ్మెల్యే ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతుల కోసం రూ.13 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా భద్రాద్రి జిల్లాలో 16 వేల మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. చుట్టపు చూపుగా వచ్చి మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని సూచించారు.
మూడోసారీ కేసీఆరే సీఎం: ప్రభుత్వ విప్ రేగా
మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందాయని అన్నారు. అవే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పువ్వాడను శాలువాతో సత్కరించారు. అలాగే, మంత్రి సమక్షంలో పీవీకాలనీ మాజీ ఎంపీటీసీ కొమరం పాపారావు బీఆర్ఎస్లో చేరారు. తొలుత నవీన్బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రేగా ముందు భాగాన బైక్పై, మంత్రి పువ్వాడ కారులో ర్యాలీ వెనుక ఉన్నారు. బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రావు జోగేశ్వరరావు, కంచర్ల చంద్రశేఖర్, విజయకుమారి, పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, యాదగిరిగౌడ్, జావేద్పాషా, రమేశ్, సంజీవరెడ్డి, నవీన్బాబు, సీతారామయ్య, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ బ్యాటరీకి చార్జింగ్ లేదు..
దండాలు పెట్టుకుంటూ తల నిమురుకుంటూ మెడ వంకరపెట్టి కౌగిలించుకుంటే అభివృద్ధి జరగదని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ చార్జింగ్ లేదని, అది ఎప్పుడో తుప్పుపట్టిపోయిందని విమర్శించారు. మళ్లీ పనిచేసే అవకాశంలేదని స్పష్టం చేశారు. బుల్లెట్ లాంటి ఎమ్మెల్యే రేగా మీకున్నారని, పనిచేసే ఎమ్మెల్యే ఉండడం పినపాక నియోజకవర్గ ప్రజల అదృష్టమని అన్నారు.