ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 11: ప్రస్తుత పాలకులు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జరిగిన టీపీటీఎఫ్ ద్వితీయ రాష్ట్రస్థాయి విద్యావైజ్ఞానిక మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల తొత్తుగా పనిచేస్తున్నదని మండిపడ్డారు.
తరగతి గదుల్లో ఉపాధ్యాయుడే అంతిమ విధాన నిర్ణయకర్త అన్నారు. అన్ని వర్గాల పేదలకు సమానస్థాయిలో బోధన అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు. కుల, మతాలకు అతీతంగా రేపటి పౌరులకు విద్య అందించాలన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై.అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ‘విద్యార్థులకు అంతరాలు లేని విద్య’ అనే నినాదంతో టీపీటీఎఫ్ నిరంతర పోరాటం చేస్తున్నదన్నారు. అనంతరం ప్రొఫెసర్ కాశీం, ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ ప్రసంగించారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ నాగిరెడ్డి, సభ్యులు మనోహర్రాజు, విజయ్ పాల్గొన్నారు.