మధిర, ఏప్రిల్ 22 : ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ఎందుకు లేదని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న పంట ఉత్పత్తులను రైతులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే మక్కల కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరాకు కేవలం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను తక్షణమే ఎత్తివేసి, ప్రతీ గింజనూ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల వద్దే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రవాణా భారం తగ్గించాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార రైతుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో మొకజొన్న రైతుల ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పల్లబోతు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బికి కృష్ణప్రసాద్, వంకాయలపాటి నాగేశ్వరరావు, సర్పంచ్ కంచం గోపి, రాయుడు భద్రయ్య, ఆళ్ల నాగబాబు, పల్లెపాటి కోటేశ్వరరావు, సయ్యద్ ఇక్బాల్, మెట్టల ప్రసాద్, బానోతు రామస్వామి, వేల్పుల శివ, దిల్లు, చీదురాల రాంబాబు పాల్గొన్నారు.